‘దిల్’ రాజు రిలీజ్ చేసినా పట్టించుకోలేదు

‘ఎవ‌రికీ చెప్పొద్దు’సినిమా ఏమైంది

ఈ వారం రిలీజైన ‘ఎవ‌రికీ చెప్పొద్దు’ సినిమా టైటిల్ ని నిర్మాతలు సీరియస్ గా తీసుకున్నట్లున్నారు. వాళ్లు దాన్ని ప్రమోట్ కూడా చేయటం లేదు. చిన్న సినిమాని ఎంత బాగా ప్రమోట్ చేస్తే అంత బాగా జనాల్లోకి వెళ్తుంది. దిల్ రాజు రిలీజ్ చేస్తున్నాడు కదా అక్కడితో మన భాధ్యత తీరిపోయిందనుకున్నారమో అసలు పట్టించుకోలేదు. దాంతో అసలు చాలా మందికి ఈ సినిమా రిలీజైందనే విషయమే తెలియకుండా పోయింది.

అంతేకాదు రివ్యూ రైటర్స్ కూడా ఎవరూ పెద్దగా ఈ సినిమా గురించి రివ్యూలు రాయలేదు. వెబ్ మీడియా ప్రక్కన పెట్టేయటంతో పూర్తిగా బజ్ లేకుండా పోయింది. సినిమా హిట్టో , ప్లాఫో తర్వాత సంగతి అసలు రిలీజైంది…ఏమైంది అనే విషయమైనా జనాలకు తెలిసేలా చెయ్యాల్సింది అని ట్రేడ్ లో అంటున్నారు.

క్రేజీ యాంట్స్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రాకేశ్ వ‌ర్రె, గార్గేయి ఎల్లాప్రగ‌డ హీరో హీరోయిన్లుగా బ‌స‌వ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రాకేశ్ వ‌ర్రె నిర్మాణంలో ‘ఎవరికీ చెప్పొద్దు’ సినిమా రూపొందింది. ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర ఫిలింస్ ప‌తాకంపై దిల్‌రాజు తెలుగులో విడుద‌ల చేసారు. ఈ చిత్రానికి సంగీతం: శంకర్‌ శర్మ, కెమెరా: విజయ్‌ జె.ఆనంద్‌.