మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి దంపతులకు తప్పిన పెను ప్రమాదం

మునుగోడు ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులకు పెను ప్రమాదం తప్పింది. శివరాత్రి సందర్భంగా ఎమ్మెల్యే దంపతులు శాలిగౌరారం మండలం చిత్తలూరు గ్రామంలో పూజలో పాల్గొన్నారు. ఆ సమయంలో గుడిలో ఓ మహిళకు విద్యుత్ వైరు తగిలి షాక్ కు గురైంది. దానిని చూసిన రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మీ ఆ మహిళను కాపాడేందుకు ఆమెను పక్కకు లాగే ప్రయత్నం చేశారు. దీంతో ఆమె కూడా షాక్ కు గురయ్యారు. 

లక్ష్మీని కాపాడేందుకు రాజగోపాల్ రెడ్డి ప్రయత్నించగా ఆయన కూడా షాక్ కు గురయ్యారు. వెంటనే తేరుకున్న సిబ్బంది కరెంట్ బంద్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఎవరూ కూడా గాయాలు కాకుండా బయటపడ్డారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఈ ఘటన కాంగ్రెస్ శ్రేణులను దిగ్భ్రాంతికి గురి చేసింది.