ఐడీఏ బొల్లారంలో భారీ అగ్నిప్రమాదం

ఐడీఏ బొల్లారంలో శనివారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వింధ్యా ఆర్గానిక్‌ ఫ్యాక్టరీలో రియాక్టర్‌ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. పేలుడు కారణంగా కంపెనీలో భారీ శబ్ధంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భయాందోళనలకు గురైన కార్మికులు కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు.

Fire Accident At Bollaram Vindhya Organics - Sakshi

ఈ నేపథ్యంలో కొంతమంది కార్మికులు కిందపడి గాయాలపాలయ్యారు. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. కంపెనీ మొత్తం రసాయనాలతో నిండిపోయింది. అక్కడికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపులోకి తెస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కంపెనీలో 120 మంది ఉన్నట్లు సమాచారం.

స్థానిక పోలీసులకు ప్రమాదంపై సమాచారం అందడంతో వెంటనే నాలుగు ఫైరింజన్లను రంగంలోకి దించారు. సుమారు ఐదారు గంటలు శ్రమిస్తే తప్ప మంటలు అదుపులోకి వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.లోపల చిక్కుకుపోయిన కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది.