తెలంగాణ బీజేపీలో నాయకత్వ మార్పుపై మళ్లీ చర్చలు ఊపందుకున్నాయి. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు పార్టీ లోపలి అసంతృప్తికి ప్రతిబింబంగా నిలిచాయి. ఇప్పటికే తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడిని నియమించాలని డిమాండ్లు వినిపిస్తున్న సమయంలో, రాజాసింగ్ వ్యాఖ్యలు కొత్త దుమారం రేపుతున్నాయి. ఆదివారం నిర్వహించనున్న పార్టీ మీటింగ్పై కూడా ఆయన వ్యంగ్యంగా స్పందించడం గమనార్హం.
“ఇలా రోజు రోజుకు టైం పాస్ మీటింగ్స్ పెడుతూ పార్టీని ముందుకు తీసుకెళ్లలేరు. ఇప్పటికే పార్టీ కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. నేతల మధ్య సమన్వయం లేకపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. పార్టీకి ఒక బాధ్యతగల పూర్తి స్థాయి అధ్యక్షుడు అవసరం. వెంటనే బాధ్యతలు అప్పగించకపోతే రాష్ట్రంలో బీజేపీ ప్రతిష్టకే నష్టం వాటిల్లుతుంది” అంటూ రాజాసింగ్ వ్యాఖ్యానించారు.
ఇది చూసి రాజకీయ విశ్లేషకులు కూడా పార్టీ లోపల పెరుగుతున్న విభేదాలను గమనిస్తున్నారు. అసలు సమస్య ఏంటంటే… ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీకి ఎలాంటి స్పష్టమైన నాయకత్వం లేకపోవడం. ఎంపీ బండి సంజయ్ తర్వాత అధికారికంగా ఎవరు బాధ్యతలు చేపట్టారనే స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో, త్వరలో జరగనున్న జాతీయ అధ్యక్ష ఎన్నికల వరకు రాష్ట్ర అధ్యక్ష నియామకం వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇక బీజేపీ హైకమాండ్ దృష్టిలో రాష్ట్ర పార్టీ పరిస్థితిపై స్పష్టత ఉన్నప్పటికీ, నిర్ణయాలు ఆలస్యం కావడంపై సీనియర్ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు రాజాసింగ్ అసంతృప్తితో పార్టీ అధిష్ఠానం ఎలా స్పందిస్తుందో చూడాలి. తెలంగాణలో భవిష్యత్తులో బీజేపీ దిశ నిర్దేశానికి నాయకత్వ మార్పు కీలకం కానుంది.