‘కాక్రోచ్ పార్టీ’ పోరాటానికే సుప్రీంకోర్టు జై కొట్టిందా..?

నేషనల్ లెవెల్‌లో ‘నీట్ యూజీ-2026’ ఎగ్జామ్ పేపర్ లీక్ వ్యవహారం సృష్టించిన భీభత్సం అంతా ఇంతా కాదు. ఈ పరీక్షా అక్రమాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు, నిరసనకారులు జంతర్ మంతర్ నుండి పార్లమెంట్ దాకా పెద్ద ఎత్తున ఉప్పెనలా ఎగసిపడ్డారు. అయితే, ఆ సమయంలో విద్యార్థులపై నమోదైన పోలీసు కేసుల వ్యవహారంలో తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక మరియు సంచలన నిర్ణయం తీసుకుంది. జూలై 20 నుండి 25 మధ్య జరిగిన నిరసనల్లో పాల్గొన్న సాధారణ విద్యార్థులపై నమోదైన అన్ని ఎఫ్‌ఐఆర్‌లను సుప్రీంకోర్టు తన ప్రత్యేక అధికారాలను ఉపయోగించి పూర్తిగా కొట్టేసింది.

నిజానికి, ఈ దేశవ్యాప్త విద్యార్థి ఉద్యమాన్ని, నిరసనలను ముందుండి నడిపించింది మరెవరో కాదు.. రీసెంట్‌గా పొలిటికల్ స్క్రీన్‌పైకి వచ్చిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’. అప్పట్లో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ 36 రోజుల పాటు ఈ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు అలుపెరగని పోరాటం చేశారు. ఆ టైంలో పోలీసులు లాఠీఛార్జ్ చేసి, కేసులు పెట్టి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తే.. విద్యార్థులపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలనే ప్రధాన డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ పార్టీ జూలై 25న తాత్కాలికంగా ఆందోళనలు విరమించింది. కానీ, ప్రభుత్వం ఆ మాట నిలబెట్టుకోలేదంటూ మళ్లీ సెప్టెంబర్ 5న ఢిల్లీ పోలీసు హెడ్‌క్వార్టర్స్ ముట్టడికి ఈ పార్టీ పిలుపునివ్వడంతో కేంద్రం ఉలిక్కిపడింది.

దాంతో హుటాహుటిన కేంద్ర ప్రభుత్వమే సుప్రీంకోర్టును ఆశ్రయించి, విద్యార్థులపై కేసులను కొట్టేయాలని కోరడంతో కోర్టు కూడా ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, ఇక్కడే సుప్రీంకోర్టు ఒక గట్టి ట్విస్ట్ ఇచ్చింది. నిరసనల పేరుతో చొరబడి తీవ్రమైన నేరచరిత్ర కలిగిన 2,873 మందిపై మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం మరియు ఢిల్లీ పోలీసులకు పూర్తి అనుమతులు ఇచ్చింది. హత్యలు, అత్యాచారాలు, కిడ్నాప్‌లు వంటి ఘోరమైన కేసులు ఉండి, విద్యార్థి ఉద్యమంలోకి దూరిన ఈ 2,873 మంది క్రిమినల్స్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని కోర్టు తేల్చి చెప్పింది. కోర్టు తీసుకున్న ఈ నిర్ణయంతో విద్యార్థులకు భారీ ఊరట లభించగా, తమ డిమాండ్ నెరవేరడంతో సెప్టెంబర్ 5న చేపట్టాల్సిన నిరసన మార్చ్‌ను కాక్రోచ్ జనతా పార్టీ అధికారికంగా ఉపసంహరించుకుంది. మొత్తానికి, దేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్‌ను కుదిపేసిన ఈ నీట్ వివాదంలో సుప్రీంకోర్టు జోక్యంతో విద్యార్థుల భవిష్యత్తు సేఫ్ జోన్‌లోకి వచ్చిందని లీగల్ వర్గాల టాక్.