జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ‘బై బై టీడీపీ’ అనేస్తున్నారా..?

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అంతర్గత వర్గాల్లో ‘నందమూరి వర్సెస్ నారా’ కోల్డ్ వార్ సరికొత్త మలుపు తిరిగింది. సుదూర అమెరికా వేదికగా జరిగిన తానా సభల సాక్షిగా పచ్చ చొక్కాల మధ్య నడిచిన ‘ముఠా గొడవలు’ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు పార్టీ కోసం రక్తం చిందించిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను, ఇప్పుడు టీడీపీలోని ఒక వర్గం పూర్తిగా దూరం పెడుతోందా? అన్న అనుమానాలకు తాజా తానా లొల్లి మరింత ఆజ్యం పోసింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా ఏకమై ఈసారి ‘టీడీపీకి బై బై’ చెప్పే రేంజ్‌లో సీన్ ముదిరిపోయినట్లు భోగట్టా.

అసలేం జరిగిందంటే.. అమెరికాలో జరిగిన తానా సభల సందర్భంగా ఎప్పటిలాగే టీడీపీ మద్దతుదారులు, ఎన్నారైలు ఒక చోట సమావేశమయ్యారు. ఆ మీటింగ్‌లో కొందరు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఉత్సాహంతో “జై ఎన్టీఆర్.. జోహార్ ఎన్టీఆర్” అంటూ నినాదాలు చేశారు. అంతే.. అక్కడ ఉన్న లోకేష్ అభిమానులు, టీడీపీలోని చినబాబు వర్గానికి చెందిన నేతలు ఒక్కసారిగా రెచ్చిపోయినట్లు సమాచారం. “ఇది టీడీపీ మీటింగ్.. ఇక్కడ నారా లోకేష్ నాయకత్వం వర్ధిల్లాలి.. అసలు ఈ మీటింగ్‌కు జూనియర్ ఎన్టీఆర్‌కు సంబంధం ఏంటి?” అంటూ గొడవకు దిగారట.

ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్రమైన వాగ్వాదం జరిగి.. చివరకు ఎన్టీఆర్ అభిమానులపై టీడీపీ స్థానిక లీడర్లు భౌతిక దాడికి కూడా దిగినట్లు వీడియోలు నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ తాజా దాడి వ్యవహారం ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్స్ గ్రూపులలో తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోంది. గతంలోనూ అనంతపురం లాంటి చోట్ల టీడీపీ ఎమ్మెల్యేలు జూనియర్ ఎన్టీఆర్‌ను, ఆయన తల్లిని ఉద్దేశించి చేసిన కామెంట్స్ వల్ల పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి.

అప్పట్లో ఎలాగోలా సర్దుబాటు చేసినా.. ఇప్పుడు ఏకంగా లోకేష్ గ్రాఫ్‌ను పెంచే క్రమంలో, జూనియర్ ఎన్టీఆర్ లీడర్‌షిప్ పేరు ఎత్తే వాళ్లందరినీ పార్టీలో తొక్కిపారేస్తున్నారనే ప్రచారం గట్టిగా సాగుతోంది. సినిమా పరంగా గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన ఎన్టీఆర్‌ను, సొంత తాత పెట్టిన పార్టీలోనే ఇంతలా అవమానించడంపై ఫ్యాన్స్ రగిలిపోతున్నారు. విశ్లేషకుల అంచనా ప్రకారం.. ఈ తరహా గొడవలు రాబోయే రోజుల్లో టీడీపీకి భారీ పొలిటికల్ డ్యామేజ్ తెచ్చిపెట్టేలా ఉన్నాయి.

“2009 ఎన్నికల్లో పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ప్రాణాలకు తెగించి ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్‌ను ఇప్పుడు పూర్తిగా పక్కనబెట్టడమే కాకుండా.. కనీసం ఆయన పేరు ఎత్తితేనే దాడులు చేసే స్థాయికి కొందరు దిగజారారు” అంటూ సోషల్ మీడియాలో ఎన్టీఆర్ సైన్యం తిరుగుబావుటా ఎగురవేస్తోంది. ఒకవైపు కూటమి ప్రభుత్వంలో అంతర్గత ర్యాంకుల గోల నడుస్తుంటే, మరోవైపు గ్లోబల్ వేదికలపై సొంత క్యాడర్ ఇలా కొట్టుకోవడం బాబు గారికి పెద్ద తలనొప్పిగా మారింది. మరి ఈ ‘బై బై టీడీపీ’ స్లోగన్ మున్ముందు ఏ రేంజ్ చిచ్చు పెడుతుందో చూడాలి.