తాను ఎవరి బాణాన్ని కాదు … ఏప్రిల్ 9 న పార్టీ ప్రకటన : షర్మిల

Sharmila's party

తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటుపై దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్రెడ్డి కుమర్తె వైయస్‌ షర్మిల స్పీడ్‌ పెంచారు. ఏపీ, తెలంగాణకు చెందిన రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్న కొత్త పార్టీ ఏర్పాటుపై వైయస్‌ షర్మిల క్లారిటీ ఇచ్చారు. పార్టీ ప్రకటించే ఆ శుభముమూర్తం ఎప్పుడో చెప్పేశారు. పనిలో పనిగా తాను ఎవరూ వదిలిన బాణం కాదని వైయస్‌ షర్మిల స్పష్టం చేశారు.లోటస్‌పాండ్‌లోని తన కార్యాలయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ముఖ్య నేతలు, వైయస్‌ అభిమానులతో షర్మల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. జిల్లా నేత లక్కినేని సుధీర్‌ ఆధ్వర్యంలో పలువురు ముఖ్య నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. పార్టీ ఏర్పాటు, విధి విధానాల విషయంలో పార్టీ నేతలకు ఉన్న అనుమానాలపై క్లారిటీ ఇచ్చా రు.

లోటస్‌పాండ్‌ పార్టీ ప్రకటనకు ముహూర్తం ఫిక్స్‌.. తాను ఎవరి బాణాన్ని కాదన్న వైయస్ షర్మిల

టీఆర్‌ఎస్‌కో, బీజేపీకో ‘బీ’టీమ్‌గా ఉండాల్సిన అవసరం తనకు లేదని షర్మిల స్పష్టం చేశారు. సమస్యల సాధనకు మాత్రమే తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేశానని చెప్పారు. ఖమ్మం వేదికగానే పార్టీ సమర శంఖం పూరిద్దామని పిలుపునిచ్చారు. ఏప్రిల్‌ 9న లక్ష మంది సమక్షంలో పార్టీ ఏర్పాటు ప్రకటన చేద్దామని చెప్పారు. ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేయాలని పలువురు వైయస్‌ అభిమానులు షర్మిలను కోరారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ తాను ఎవరో వదిలిన బాణాన్ని కాదని రాజకీయ విమర్శలకు వైయస్‌ షర్మిల చెక్‌ పెట్టారు. తెలంగాణలో మళ్లీ రాజన్న రాజ్యం తేవడానికి స్వతంత్రంగానే ఎదుగుతామని షర్మిల స్పష్టం చేశారు.

ప్రజా సమస్యలే ఎజెండాగా ప్రజల్లోకి వెళతామన్నారు. పార్టీ విధివిధానాలపై మేధావులు, సీనియర్‌ నేతలతో చర్చిస్తున్నామని చెప్పారు. ప్రజల కేంద్రంగా పార్టీ జెండా, ఎజెండా రూపొందుతుందని అన్నారు.అయితే రాజకీయ వర్గాలు ముందునుంచే భావిస్తున్నట్టు ఖమ్మం జిల్లా కేంద్రంగా కొత్త పార్టీ ప్రకటిస్తుండటం పట్ల ఆ జిల్లా నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఎక్కడి నుంచి షర్మిల పోటీ చేసినా బంపర్‌ మెజార్టీతో గెలిపిస్తామని ఆ జిల్లా నేతలు చెప్పారు. వైయస్‌ అభిమానులుగా ఆ బాధ్యత మాపై ఉందన్నారు.