YS Jagan: 2029లో అధికారంలోకి వచ్చేది మేమే.. అప్పుడు అన్నీ తిరిగి లాక్కుంటాం: జగన్ మాస్ వార్నింగ్!

YS Jagan: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె పర్యటనలో భాగంగా మత్స్యకారులతో నిర్వహించిన ముఖాముఖిలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యంగా జగన్ కీలక వ్యాఖ్యలు చేస్తూ, రాబోయే ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్రంలోని ఫిషింగ్ హార్బర్లను ప్రభుత్వం “దుర్మార్గంగా” ప్రైవేటీకరిస్తోందని జగన్ మండిపడ్డారు. ముఖ్యంగా జువ్వలదిన్నె హార్బర్‌ను ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రయత్నాలను ఆయన తీవ్రంగా ఖండించారు.”జువ్వలదిన్నె హార్బర్‌ను ప్రైవేటు సంస్థలకు లేదా డిఫెన్స్ కంపెనీలకు అప్పగిస్తే ఊరుకునేది లేదు. మా ప్రభుత్వం రాగానే వాటిని తిరిగి స్వాధీనం చేసుకుంటాం. ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వాలంటే కృష్ణపట్నం పోర్టు దగ్గర ఇచ్చుకోవాలి కానీ, మత్స్యకారుల పొట్ట కొట్టడం తగదు” అని జగన్ హెచ్చరించారు.

వైసీపీ హయాంలో మత్స్యకార రంగానికి చేసిన అభివృద్ధిని జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు, దాదాపు ₹26,000 కోట్ల పెట్టుబడులతో 4 పోర్టులు, 10 హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల పనులను ప్రారంభించాం. ఈ హార్బర్‌లో 1255 బోట్లు నిలిపేలా నిర్మాణం చేపట్టాం. దీనివల్ల 25 వేల మత్స్యకార కుటుంబాలకు ఉపాధి లభిస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ఈ హార్బర్‌ను ప్రారంభించి ఏడాదిన్నర అవుతున్నా, ఇప్పటికీ మత్స్యకారులకు ఎందుకు హ్యాండోవర్ చేయలేదని జగన్ ప్రశ్నించారు.

సీఎం చంద్రబాబుకు మత్స్యకారులకు మంచి చేయాలనే ఆలోచన ఏనాడూ లేదని జగన్ విమర్శించారు. “హార్బర్లు మత్స్యకారుల సొత్తు. చంద్రబాబు కాదు కదా, ఆయన తాత వచ్చినా వీటిని మత్స్యకారులకు దూరం చేయలేరు” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుత ప్రభుత్వం ఎల్లకాలం అధికారంలో ఉండదని, 2029లో వైసీపీ అధికారంలోకి రావడం తథ్యమని జగన్ ధీమా వ్యక్తం చేశారు. గతంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఇచ్చిన హెచ్చరికల తరహాలోనే, ఇప్పుడు హార్బర్ల విషయంలో కూడా జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారాయి.

YCP Social Media Works Strongly, Will TDP Handle? | Jagan | Telugu Rajyam