పాన్ ఇండియా చిత్రంతో మరో తమిళ హీరో రెడీ!

యాక్షన్ హీరో విశాల్ కధానాయకుడిగా ఎ.వినోద్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘లాఠీ’. హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రానా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రమణ, నందా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విశాల్ సరసన ఈ చిత్రంలో సునైనా కథానాయికగా నటిస్తుంది.

తాజాగా జరిగిన షూటింగ్ లో విశాల్‌ కు గాయాలు కావడం, ఫైట్ సీక్వెన్స్‌ల కోసం భారీ వీఎఫ్ఎస్ వర్క్‌ కారణంగా ఈ చిత్రం విడుదలను ఆగస్టు 12 నుండి సెప్టెంబర్ 15కి వాయిదా వేశారు. సెప్టెంబర్ 15న  ‘లాఠీ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.

తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి అన్ని భాషలకు ఒకే టైటిల్‌ పెట్టారు. ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ ని దర్శకుడు వినోద్‌ కుమార్‌ సరికొత్త కథాంశంతో తెరకెక్కించారు. సమాజంలో మార్పు తెచ్చే శక్తి లాఠీకి వుంది. విశాల్‌ ఆ ‘లాఠీ’ తో సమాజంలో ఎలాంటి మార్పులకు నాంది పలికారో అన్నది ఆసక్తికరం. ఈ చిత్రంలో విశాల్ ఫుల్ లెంత్ యాక్షన్ కి ప్రాధాన్యత వున్న పాత్రలో నటిస్తున్నారు.

ఈ చిత్రం కోసం అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు. ద్వితీయార్ధంలో ఉండే 45నిమిషాల యాక్షన్‌ సీక్వెన్స్‌ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. దిలీప్‌ సుబ్బరాయణ్‌ మరో స్టంట్ మాస్టర్ గా పనిచేశారు. బాలసుబ్రమణ్యన్‌ ఛాయాగ్రహకుడిగా, సామ్‌ సిఎస్‌ సంగీత దర్శకుడిగా, పొన్ పార్థిబన్ రచయితగా ఈ చిత్రానికి పనిచేస్తున్నారు.