వర్మ నిన్ను వదలా..నీ సినిమాలేవీ విడుదల కానివ్వను : నిర్మాత నట్టి కుమార్‌ ఫైర్‌

తన సినిమాలకు డబ్బులు పెట్టుబడిగా పెట్టిన ఫైనాన్సియర్లు, నిర్మాతలను మోసం చేస్తూ, తిరిగి వారిమీదే కేసులు పెట్టే పరిస్థితికి దర్శక, నిర్మాత ,రామ్‌ గోపాల్‌ వర్మ దిగజారడం సిగ్గుచేటని నిర్మాత నట్టి కుమార్ విమర్శించారు. శనివారం సాయంత్రం హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో మరో నిర్మాత శేఖర్ రాజు, అడ్వొకేట్ నిఖిల్ తో కలసి ఆయన మాట్లాడారు. ఆర్జీవీ మోసగాడని మొదట తనకు తెలియదని, అందుకే ఆయనతో కలసి కొన్ని సినిమాలు చేశానని అన్నారు. అయితే డబ్బులు ఎగగొట్టడమే పనిగా పెట్టుకున్న వర్మ తను మాకు స్వయంగా ఇచ్చిన డాక్యూమెంట్స్ ,, సంతకాలను సైతం ఫోర్జరీ అని ప్రచారం చేస్తూ, తమపైనే అక్రమ కేసులు పెడుతుండటం ఆయన క్రిమినల్ మెంటాలిటీకి నిదర్శనమని నట్టి కుమార్ దుయ్యబట్టారు. ఇందులో భాగంగానే తనను ఎదుర్కొనే ధైర్యం లేక, చిన్న పిల్లలు అయిన తన కుమారుడు, కుమార్తె క్రాంతి, కరుణలపై కేసులు పెట్టడాన్ని బట్టి వర్మ నీచత్వం ఏంటో అర్ధమవుతుందని, ఫ్యామిలీ మీద కేసులు పెడితే, తాను భయపడి వెనక్కి తగ్గుతానని, వర్మ అనుకోవచ్చు, కానీ అయితే ఇలాంటి తాటాకు చప్పుళ్లకు తాము ఎంతమాత్రం భయపడమని అన్నారు. దాదాపు 22 డాక్యూమెంట్స్ వర్మ మాకు ఇచ్చారు. అందులో వందల సంతకాలు పెట్టాడు. మేము బ్యాంకు ద్వారా ఇచ్చిన డబ్బులు వంటివన్నీ ఫోర్జరీయే అవుతాయా!, వీటన్నింటికీ ఆయన ఏం సమాధానం చెబుతాడు.

తమతో పాటు ఇంకా ఎంతోమందికి వర్మ డబ్బులు ఇవ్వాలి. వాళ్ళందరిని కూడా ఇలానే మోసం చేస్తూ, బెదిరిస్తున్నాడని నట్టి కుమార్ అన్నారు.

వాళ్లంతా తనతో కలసి ఎక్కడ పోరాటం చేస్తారోనన్న ఉద్దేశ్యంతో ఒక పధకం ప్రకారం తన పిల్లలపై కేసులు పెడితే, అందరూ భయపడి వెనక్కి తగ్గుతారన్న ఆలోచనతో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పలు రకాల సెక్షన్ల కింద పిర్యాదు చేసాడని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే రాంగోపాల్ వర్మ తమకు ఇవ్వాల్సిన డబ్బులపై కోర్టుకు వెళ్లడం జరిగిందని, ఆ మేరకే వర్మ తీసిన `లడకీ’,(ఎంటర్ ది గర్ల్ డ్రాగన్), మా ఇష్టం’ (డేంజరస్’ చిత్రాలు విడుదల కాకుండా కోర్టు నిలిపి వేసిందని అన్నారు. అలాగే వర్మ సినిమాలేవీ ఇకపై విడుదల కాకుండా ఇలానే అడ్డుకుంటూనే ఉంటామని అన్నారు. తమ డబ్బులు చెల్లించేంతవరకు వర్మను వదిలి పెట్టే ప్రసక్తే లేదని, ఎలాంటి లీగల్ పోరాటానికైనా తాము సిద్ధమేనని అన్నారు.

ఇలాంటి మోసం చేసేవాళ్ల వల్ల సినిమా పరిశ్రమలో ఫైనాన్స్ చేసేందుకు ఫైనాన్సియర్స్ భయపడిపోయి, ఇతర నిర్మాతలకు డబ్బులు ఇచ్చేందుకు వెనక్కి తగ్గుతారు అని అన్నారు. వర్మ సినిమాలు వేటినీ కొనవద్దని, అలాగే ఆయనతో కలసి సినిమాలు తీయవద్దని పరిశ్రమకు చెందినవారికి ముందుగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే అవి విడుదల కాకుండా నిలిచిపోతాయని, తద్వారా వారు నష్టపోయే అవకాశం ఉందని ఆయన అన్నారు. తమను మోసం చేసినట్లే మిగతా వారిని వర్మ మోసం చేస్తాడని అందరూ గ్రహించాలని అన్నారు.

మరో నిర్మాత శేఖర్ రాజు మాట్లాడుతూ, సినిమా రంగంలోనికి నేను ఫ్యాషన్ తో వచ్చాను. తాను తీసిన దిశా సినిమాకు తననే నిర్మాత పెడతానని నమ్మించి, వర్మ తన దగ్గర 56 లక్షల రూపాయలు తీసుకున్నారని, అయితే ఆ సినిమాకు వేరే నిర్మాతల పేర్లు వేసి, తనను మోసం చేసాడు అని చెప్పారు. ఎన్నోసార్లు ఈ విషయం గురించి ఆయనను కలిసే ప్రయత్నం చేసినా, వృధా ప్రయాసే అయ్యిందని అన్నారు. అందుకే ఇక లాభం లేదనుకుని, మియాపూర్ పోలీస్ స్టేషన్ లో ఆయనపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశానని చెప్పారు. తనకు రావలసిన డబ్బులపై లీగల్ గా పోరాటం చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఇదే సమావేశంలో అడ్వొకేట్ నిఖిలేష్ కూడా పాల్గొన్నారు.

వర్మ బాధితులకు అండగా ఉంటా

తాను తీసిన గోతిలో తానే పడ్డ చందాన రాంగోపాల్ వర్మకు కూడా అదే గతి పట్టబోతోందని ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ వ్యాఖ్యానించారు.

రాంగోపాల్ వర్మ తాజాగా మాట్టాడుతున్న మాటలకు నట్టి కుమార్ ప్రతిస్పందిస్తూ, ఆదివారం ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. చాలామంది దగ్గర తన సినిమాల కోసం ఫైనాన్స్ తీసుకున్న వర్మ వాటిని తిరిగి చెల్లించకుండా, ఎప్పడైతే ఎగగొట్టాలన్న దుర్బుద్ధితో డ్రామాలు ఆడటం మొదలు పెట్టాడో.. అప్పట్నుంచే అతని పతనం అనే సినిమా ఆరంభమైంది. దానిని అతని బాధితులందరం కలసి సంయుక్తంగా నిర్మిస్తున్నాం. ఇప్పుడే ఆ నిర్మాణ కార్యక్రమాలన్నీ వేగవంతమయ్యాయి. త్వరలోనే అతను ఊహించని రీతిలో ఆ సస్పెన్స్, క్లైమాక్స్ తో ఆ సినిమా ఉండబోతోంది. జనం కూడా వర్మ పతనం అనే సినిమాను అత్యంత ఆసక్తిగా చూస్తారు. వర్మ ప్రస్తుతం తాను చేస్తున్న అన్యాయం అనే సినిమా ఎక్కువ కాలం మనజాలదు. అయితే అతను అన్యాయమే పరమావధిగా రాస్తున్న స్క్రిప్ట్ సక్సెస్ అవుతుందనే భ్రమలో ఉంటూ, దానినే భవిష్యత్ గా భావిస్తూ, తన వందిమాగధులు చెప్పింది ఆచరిస్తున్నారు. అయితే న్యాయం అనే కాన్సెప్ట్ మా ప్రధాన అజెండా. దానిని నమ్ముకునే మేము ముందుకు సాగుతున్నాం. వర్మ పతనం అనే సినిమాను చాలా ఆసక్తిగా జనాలకు చూపించి తీరుతాం. ఒకప్పుడు రాంగోపాల్ వర్మ అంటే ఒక క్రేజ్, ఒక క్రియేటివిటీ. ఉండేది. కానీ గత కొన్నేళ్ళుగు వాటికి దూరమైన వర్మ ఇలా ఆర్ధిక మోసాలు చేయడమే పనిగా పెట్టుకున్నాడు. ఊసరవెల్లి తరహాలో అతని మైండ్ సెట్ మారింది. నమ్మించి ఫైనాన్స్ తీసుకోవడం, ఆ తర్వాత వారిని నువ్వెవరు! నీకు ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. దిక్కున్న చోట చెప్పుకో! అనే తరహాలో ఫైనాన్స్ ఇచ్చిన వారిని బెదిరించడం పనిగా పెట్టుకున్నాడు. అతని నిజ స్వరూపం ఇప్పుడిప్పుడే అందరికీ అర్ధమవుతోంది. అందుకే వర్మ చేతిలో దగాపడ్డ బాధితులు ఎవరు తనను కలిసినా అలాంటి వారికి చట్ట పరిధిలో, న్యాయ పరిధిలో కొండంత అండ, దండ, భరోసాగా నేనుంటాను. అలా వర్మ బాధితులు ఎవరు నా దగ్గరకు వచ్చినా, వారితో కలసి మా పోరాటాన్నివిజయవంతంగా ముందుకు తీసుకుని వెళ్లి వర్మ పతనం అనే సినిమాను ఎవరూ ఊహించని రీతిలో నిర్మించదలచుకున్నాం. శేఖర్ రాజు కూడా వర్మ వల్ల మోసపోయి, నా దగ్గరకు వచ్చి, నాతో కలసి పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాడు. అలాగే ఇంకా ఎంతో మంది వర్మ బాధితులంతా ఏకమై, వర్మ పతనం సినిమాలో కీలక పాత్ర పోషించనున్నారు ‘ అని వెల్లడించారు.