మూడో సినిమాకు ముహూర్తం పెట్టిన ఉప్పెన హీరో.. ఇక జోరు ఆగ‌దంటున్న వైష్ణ‌వ్

మెగా ఫ్యామిలీ నుండి ఉప్పెన‌లా దూసుకొచ్చిన హీరో వైష్ణ‌వ్ తేజ్. యాక్టింగ్ అంటేనే భ‌యం అని చెప్పిన వైష్ణ‌వ్ ఇప్పుడు తొలి సినిమాతోనే బంప‌ర్ హిట్ కొట్టాడు. ఈ చిత్రం సాధించిన విజ‌యం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌ను కూడా షాక్‌కు గురి చేసింది. డెబ్యూ హీరోగా తొలి రోజు అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ సాధించిన ఘ‌న‌త వైష్ణ‌వ్‌కు ద‌క్కింది. ప్ర‌స్తుతం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వ‌సూళ్ళ ఉప్పెన సృష్టిస్తున్న ఈ చిత్రం రానున్న రోజుల‌లో స‌రికొత్త రికార్డ్‌లు క్రియేట్ చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.

లాక్‌డౌన్ త‌ర్వాత విడుద‌లైన ఉప్పెన చిత్రాన్ని డెబ్యూ ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు తెర‌కెక్కించాడు. ఇందులో హీరోహీరోయిన్స్ వైష్ణ‌వ్ తేజ్, కృతి శెట్టి కొత్త‌వారే. ఇక కీ రోల్ పోషించిన విజ‌య్ సేతుప‌తి త‌మిళ న‌టుడు. అయిన‌ప్ప‌టికీ సినిమిపై చాలా న‌మ్మకంతో థియేట‌ర్స్‌కు వెళ్ళిన ప్రేక్ష‌కులు సంతోషంతో బ‌యట‌కు తిరిగి వ‌చ్చారు.సినిమాను ఎంత‌గానో ప్రేమిస్తూ ఉప్పెన‌కు వ‌సూళ్ళు వ‌ర్షం కురిపిస్తున్నారు. ఫిబ్ర‌వ‌రి 12న విడుద‌లైన ఈ చిత్రం మంచి టాక్స్, అద్భుత‌మైన క‌లెక్ష‌న్స్‌తో దూసుకుపోతుంది. తొలి చిత్రం మంచి విజ‌యం సాధించ‌డంతో వైష్ణ‌వ్ తేజ్ త‌న త‌ర్వాతి సినిమాల విష‌యంలో ఏ మాత్రం లేట్ చేయ‌డం లేద‌నిపిస్తుంది.

ఇప్ప‌టికే వైష్ణవ్ తేజ్.. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రాన్ని చేయ‌గా, ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయిక‌గా న‌టించింది. లాక్‌డౌన్ త‌ర్వాత చిత్ర షూటింగ్ పూర్తైంది. ఈ ఏడాదే ఆ సినిమాను విడుద‌ల చేయ‌నున్నారు అనే టాక్ వినిపిస్తుంది. ఇక వైష్ణ‌వ్ తేజ్ మూడో సినిమాకు కూడా సైన్ చేసిన‌ట్టు తెలుస్తుంది. టాలీవుడ్‌లో అగ్ర నిర్మాణ సంస్థలో ఒకటైన అన్నపూర్ణ స్టూడియోస్.. వైష్ణ‌వ్ తేజ్‌తో సినిమా చేయ‌డానికి డేట్స్ తీసేసుకుంద‌ట‌. అక్కినేని నాగార్జున నిర్మాణంలో రూపొంద‌నున్న ఈ చిత్రాన్ని పృథ్వీ అనే ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించనున్న‌ట్టు తెలుస్తుది. ఈ చిత్రం అత‌నికి తొలి సినిమా కావ‌డం విశేషం జూలై నుంచి ఈ సినిమా సెట్స్‌పైకి వెళుతుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.