కరోనాతో టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ మృతి

కరోనా విలయతాండవం ఆగట్లేదు. సినీ పరిశ్రమలో కూడ వరుస మరణాలు సంభవిస్తున్నాయి. రెండు రోజుల క్రితం ప్రముఖ తమిళ దర్శకుడు కెవి.ఆనంద్ కన్నుమూయగా తాజాగా మరొక టాలీవుడ్ దర్శకుడు కరోనా బారినపడి మరణించాడు. శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘మా అబ్బాయి’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన కుమార్ వట్టి కరోనా సోకడంతో కొద్దిరోజులుగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

రెండు రోజుల క్రితం ఆయన పరిస్థితి మరీ విషమించడంతో ఈరోజు తెల్లవారుఘామున ఆయన మృతి చెందారు. దీంతో టాలీవుడ్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎంతో భవిష్యత్తు ఉన్న యువ దర్శకుడు మరణించడం పలువుర్ని కలచివేస్తోంది.

కుమార్ వత్తు పరశురామ్ వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసి తర్వాత మార్తాండ్ కె వెంకటేష్ వద్ద ఎడిటింగ్ విభాగంలో 30కి పైగా సినిమాలకు వర్క్ చేశారు. 2017లో ‘మా అబ్బాయి’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన వట్టి కుమార్ ఇటీవలే ఒక కథను సిద్ధం చేసుకుని నిర్మాతలతో సంప్రదింపులు జరుపుతూ వచ్చారు. ఈలోగానే ఆయన కరోనా ఆయన్ను బలిగొంది.