థర్డ్ వేవ్: మోడీ ప్రభుత్వం వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వాలు..

Modi Govt Vs State Govts

Modi Govt Vs State Govts

కరోనా థర్డ్ వేవ్ విషయమై ముందుగానే రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయ్. ముందుగా చంటి బిడ్డల తల్లులకు వ్యాక్సిన్ వేయించాల్సిందిగా ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, స్పష్టమైన ఆదేశాలు అధికార యంత్రాంగానికి జారీ చేశారు. చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రుల్లో పడకలు కేటాయించాలనీ, తల్లి అవసరం వుంటుంది కాబట్టి, ఆమెకీ పడక తప్పనిసరి అనీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూచించారు. మరోపక్క, తెలంగాణ రాష్ట్రం కూడా థర్డ్ వేవ్ విషయమై అప్రమత్తమవుతోంది. థర్డ్ వేవ్ ఎప్పుడు వస్తుంది.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి.

మహారాష్ట్రలో ఇప్పటికే కరోనా మూడో వేవ్ మొదలైందన్న ప్రచారం జరుగుతోంది. అయితే, ఆ ప్రభావం ప్రస్తుతానికి పెద్దగా లేదని నిపుణులు చెబుతున్నారు. మూడో వేవ్‌ని ఎదుర్కోవడమంటే అది వ్యాక్సిన్ ద్వారానే సాధ్యమన్నది వైద్యులు, ప్రభుత్వాలు చెబుతున్న మాట. ఇప్పుడు జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలిస్తే, మూడో వేవ్ పూర్తయ్యాక.. నాలుగో వేవ్ వచ్చాక కూడా వ్యాక్సినేషన్ విషయమై ఇప్పుడు జరుగుతున్న చర్చే జరుగుతుందన్నది కొందరు పరిశీలకుల అంచనా.

దాదాపు 140 కోట్ల మంది జనాభా వున్న భారతదేశంలో వ్యాక్సినేషన్ అంత తేలికైన ప్రక్రియ కాదు. అత్యంత సంక్లిష్టమైనది. అత్యంత వ్యూహాత్మకంగా చేపట్టాల్సిన వ్యాక్సినేషన్ ప్రక్రియను అడ్డగోలుగా ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రాలు మొదట్లో వ్యాక్సినేషన్ సరిగ్గా చేయలేదని కేంద్రం ఈ మధ్యనే నిందారోపణలు మొదలు పెట్టింది. తాజాగా 18 ఏళ్ళు ఆ పైబడినవారందరికీ ఉచిత వ్యాక్సినేషన్.. అని ప్రధాని మోడీ ప్రకటించారు. కానీ, ఎలా.? ఈ నెల 21 నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది.

అంటే, దానికింకా దాదాపు రెండు వారాల సమయం వుంది. వృధా అవుతున్న ఒక్కో రోజూ.. పరిస్థితిని చెయ్యిదాటేలా చేస్తుందన్నది నిర్వివాదాంశం. కేంద్రం బాధ్యత వహించాల్సింది పోయి.. థర్డ్ వేవ్ విషయమై రాష్ట్రాలు సొంతంగా ఏర్పాట్లు చేసుకోవాల్సి రావడమంటే అంతకన్నా దారుణమైన విషయం ఇంకేముంటుంది.?