Vakeel Saab: లాక్ డౌన్ అనంతరం విడుదలైన పెద్ద చిత్రం ‘వకీల్ సాబ్’. పవన్ కళ్యాణ్ సినిమా కావడంతో ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ నెలకొంది. పెద్ద సంఖ్యలో థియేటర్లు లభించాయి. కానీ సినిమా మీద కుట్రలు మొదలయ్యాయి. అప్పటివరకు లేని రూల్స్, జీవోలను ఏపీ ప్రభుత్వం బయటకు తీసింది. అదనపు షోలకు అనుమతులు ఇవ్వలేదు. టికెట్ ధరలు పెంచుకునే వీలు కల్పించలేదు. పైగా ఉన్న టికెట్ ధరలను తగ్గించేసి కొన్నేళ్ల క్రితం నాటి టికెట్ రేట్లను అమలులోకి తీసుకొచ్చారు. ఫలితంగా వసూళ్లు దెబ్బతిన్నాయి.
ప్రేక్షకులు, మహిళలు పెద్ద ఎత్తున థియేటర్లకు వచ్చినా కొన్నిచోట్ల నష్టాలు తప్పలేదు. పైగా కరోనా భయం ఒకటి. పవన్ కళ్యాణ్ కాబట్టి తన ఛరీష్మాతో ఇన్ని కష్టాల నడుమ సినిమాను లాక్కొచ్చారు కానీ వేరే ఎవరైనా అయ్యుంటే భారీ నష్టాలే మిగిలేవి. పైపెచ్చు రెండు తెలుగు రాష్ట్రాల్లో విధించిన నైట్ కర్ఫ్యూ కారణంగా రోజుకు రెండు షోలు రద్దయ్యాయి. అలా సినిమా వసూళ్ల మీద పెను ప్రభావం పడింది. ప్రజెంట్ ఏపీ, తెలంగాణలో థియేటర్లు లేవు. సో ‘వకీల్ సాబ్’ ఎక్కడ నడవట్లేదు. దీంతో ఈ నెల 30న అమెజాన్ ద్వారా సినిమాను ప్రసారం చేయనున్నారు.
దీని మీద అక్కసు కక్కుతున్నారు కొందరు. గతంలో సినిమా విడుదలైన 90 రోజుల తర్వాతనే ఓటీటీలో వేయాలనే నిబంధన పెట్టుకున్నారు నిర్మాతలు. కానీ ఇప్పుడు దిల్ రాజే సినిమా రిలీజై నెల కూడ కాకుండానే ఓటీటీకి ఇస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. సినిమా థియేటర్లలో ఉండి ఉంటే ఓటీటీలో వదలడం తప్పే. కానీ అసలు థియేటర్లే లేవు. సినిమా బయట ఎక్కడా లేదు. అలాంటప్పుడు ఓటీటీలో వదలడంలో తప్పేమిటో నోళ్లు పారేసుకుంటున్న వారికే తెలియాలి.