Crime News: కన్న బిడ్డల ప్రాణాలు తీసిన తల్లి.. కుటుంబ కలహాలే కారణమా?

Crime News: ఈ మధ్యకాలంలో భార్యాభర్తలు ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకపోవడం వల్ల తరచూ వారి మధ్య మనస్పర్థలు వస్తుంటాయి. కొన్ని సందర్భాలలో వారి సమస్య పెద్దమనుషులు, పోలీస్ స్టేషన్ వరకు వెళ్తుంది.పెద్దమనుషులు సర్ది చెప్పినా కూడా వినకుండా కొందరు తరచూ గొడవ పడుతూ ఉంటారు. తల్లి తండ్రులు గొడవ పడటం వల్ల ఏ పాపం ఎరుగని చిన్నారులు బలి అవుతున్నారు. ఇటీవల ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. ఘటనలో తల్లితో పాటు పిల్లలు కూడా మరణించారు.

వివరాలలోకి వెళితే..క్రిష్ణగిరి మత్తూరు సమీపంలోని నడుపనట్టి గ్రామానికి చెందిన వెంకటేషన్‌కి అదే గ్రామానికి చెందిన గాయత్రి అనే మహిళతో తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. పెళ్లి జరిగిన కొన్ని రోజులు వరకు వీరి కాపురం సజావుగా సాగింది. తర్వాత చిన్న చిన్న కారణాల వల్ల భార్యభర్తలిద్దరు తరచు గొడవ పడుతూ ఉండేవారు.

వెంకటేషన్‌ కుటుంబ పోషణ కోసం తిరుపతిలో టోపీలు అమ్మేవాడు. వ్యాపార నిమిత్తం తిరుపతిలోనే ఎక్కువగా ఉండేవాడు. నెలలు తరబడి భర్త ఇంటికి రాకుండా తిరుపతి లోనే ఉండటంతో కోపంతో గాయత్రి భర్తతో గొడవ పడేది. ఈ క్రమంలో శనివారం రాత్రి గాయత్రి తన ఇద్దరు పిల్లలను చంపి తను కూడా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కోడలు , పిల్లలు చనిపోయి ఉండటం గమనించిన గాయత్రి అత్త పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.