లెజెండ్రీల శకం ముగిసినట్టే.!

టాలీవుడ్ లో ఎనలేని క్రేజ్ ని సొంతం చేసుకున్న కథానాయకులంతా ‘ఇక సెలవంటూ..’ కళామతల్లికి వీడ్కోలు పలుకుతూ అనంత లోకాలకు పయనమయ్యారు. తెలుగు చిత్ర సీమలో తొలి తరం హీరోలుగా కొనసాగిన వారిలో నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావు, శోభన్ బాబు, కృష్ణంరాజు, ఇప్పుడు నటశేఖర కృష్ణ వంటి కథానాయకులందరూ ఎంతో అద్భుతమైన చిత్రాల్లో తమ పాత్రలకు ప్రాణప్రతిష్ట చేసి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా ఎన్నో విభిన్నమైన చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రల ద్వారా ప్రేక్షకుల మన్నలను పొందిన ఈ హీరోలందరూ కళామతల్లికి సెలవు ప్రకటించారు. తెలుగు చిత్రసీమలో లెజెండ్ గా గుర్తింపు పొందిన ఈ హీరోలందరూ ఒక్కొక్కరిగా మరణిస్తూ చిత్ర పరిశ్రమకు తీరని లోటును మిగిల్చారు.

ఈ నేపథ్యంలో నందమూరి తారక రామారావు, శోభన్ బాబు, నాగేశ్వరరావు వంటి లెజెండరీ నటులు మరణించి కొన్నేళ్లు గడచింది. ఇక ఈ తరం హీరోలలో కృష్ణంరాజు, కృష్ణ వంటి వారు కూడా సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలు అందించారు. ఇలా నిన్నటి తరం హీరోలలో ఈ ఇద్దరు హీరోలు బ్రతికున్నప్పటికీ రెండు నెలల వ్యవధిలోనే వీళ్ళు కూడా మరణించడం ఇండస్ట్రీలో తీవ్ర విషాదాన్ని నింపింది. కృష్ణంరాజు గుండెపోటుతో సెప్టెంబర్ 11న మరణించిన విషయం తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ సైతం గుండెపోటు కారణంగా నవంబర్ 15న తుది శ్వాస విడిచారు. ఇలా కృష్ణ మరణంతో నిన్నటి తరం హీరోలంతా చిత్రసీమకు సెలవు ప్రకటిస్తూ అనంత లోకాలకు వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే ఈ విషయం గుర్తు చేసుకొని ఎంతోమంది అభిమానులు తమ అభిమాన హీరోలను, వారు నటించిన సినిమాలను నెమరేసుకుంటున్నారు. సూపర్ స్టార్ కృష్ణగారి మరణంతో నిన్నటి తరం హీరోల శకం ముగిసినట్టే!