Crime News: హై స్కూల్లో విద్యార్ధినుల పై టీచర్ లైంగిక వేదింపులు.. చర్యలు తీసుకోవాలని డిమాండ్..!

Crime News: పాఠశాలలో పిల్లలకు పాఠాలు చెప్పి పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన ఉపాధ్యాయులే విద్యార్థుల పట్ల క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. ప్రతినిత్యం ఎక్కడో ఒక చోట ఇటువంటి దారుణాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. వీటిని అదుపు చేయడానికి పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ ఈ దుర్మార్గపు టీచర్ల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. ఇటీవల ఇటువంటి ఈ సంఘటన ఒకటి గుత్తి కోట హై స్కూల్ లో వెలుగులోకి వచ్చింది.

వివరాలలోకి వెళితే…గుత్తికోట జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్న ఓ ఉపాధ్యాయుడు తొమ్మిదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థినులను లైంగికంగా వేధించాడు. వారిని లైంగికంగా ఇబ్బంది పెట్టడమే కాకుండా ఈ విషయం ఎవరితోనూ చెప్పకుండా వారిని బెదిరించాడు. అయితే ఉపాధ్యాయుడి తీరుపట్ల సహనం కోల్పోయిన విద్యార్థినిలు తాము పాఠశాలకు వెళ్ళమని తల్లిదండ్రులతో తమ బాధ విలపించారు.ఓ విద్యార్థిని తల్లిదండ్రులు డయల్‌ 100కు పోలీసులకు కూడా సమాచారమిచ్చారు.

ఈ సంఘటనపై పోలీసులు ఈనెల 4వ తేదీ పాఠశాలకు వెళ్లి విచారణ చేపట్టారు. ఈ ఉదంతం విషయంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కూడా ఏవిధంగా స్పందించకపోవడంతో తల్లిదండ్రులు విమర్శలు చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ సంఘటనపై పోలీసులు ఆ ఉపాధ్యాయుడు మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో పిల్లల తల్లిదండ్రులు విమర్శలు చేస్తున్నారు. సదరు ఉపాధ్యాయుడు పూర్వం పుట్లూరు మండలం కడవకల్లు ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న సమయంలో ఈ తరహాలోనే విద్యార్థిని వేధించిన ఘటన వల్ల గ్రామ ప్రజలందరూ అతనికి దేహశుద్ధి చేసి అతనిపై కేసు నమోదు చేశారు.