బ్యాట్‌తో రొమాన్స్ మొద‌లు పెట్టిన తాప్సీ.. ఇక సిక్స‌ర్ల మోత మోగాల్సిందే అంటున్న సొట్ట‌బుగ్గ‌ల సుంద‌రి

ఝుమ్మంది నాదం చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన న‌టి తాప్సీ ప‌న్ను. చూడ చ‌క్కని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యం ఆమె సొంతం. కెరీర్ తొలి నాళ్ళ‌లో తెలుగు, త‌మిళ భాష‌ల‌లో న‌టించిన తాప్సీ పెద్ద‌గా గుర్తింపు తెచ్చుకోలేక‌పోయింది.దీంతో బాలీవుడ్ ఫ్లెటెక్కింది. అక్క‌డ క్రేజీ పాత్ర‌ల‌ను సొంతం చేసుకుంటూ మంచి విజ‌యాల‌ను అందిపుచ్చుకుంటుంది. ఇచ్చిన పాత్ర‌కు స‌రైన న్యాయం చేసే తాప్సీ ఈ మ‌ధ్య ఎక్కువ‌గా ప్ర‌యోగాత్మ‌క చిత్రాలు చేస్తుంది.

తాప్సీ ప్ర‌స్తుతం ర‌ష్మీ రాకెట్‌, శ‌భాష్ మిధు అనే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ చిత్రాలతో బిజీగా ఉంది. ర‌ష్మీ రాకెట్ చిత్రంలో తాప్సీ అథ్లెట్‌గా క‌నిపించాల్సి ఉండ‌గా, దీని కోసం ఆమె చేసిన క‌స‌ర‌త్తులు అన్నీ ఇన్నీ కావు. అథ్లెట్ పాత్ర కోసం తాను ఎంత‌గా క‌ష్ట‌ప‌డుతుంద‌నేది ఎప్ప‌టిక‌ప్పుడు త‌న సోష‌ల్ మీడియాలో అప్‌డేట్ చేస్తూ వ‌చ్చింది తాప్సీ. ఆమె క‌ష్టాన్ని చూసి అభిమానులు క‌న్నీరు పెట్టుకున్నంత పనైంది. అయితే ఈ చిత్ర షూటింగ్‌ని స‌క్సెస్ ఫుల్‌గా పూర్తి చేసిన తాప్సీ ప‌న్ను ప్ర‌స్తుతం భార‌త మ‌హిళా క్రికెట్ జ‌ట్టు స‌భ్యురాలు మిథాలీ రాజ్ బ‌యోపిక్‌లో న‌టిస్తుంది.

టీమిండియా మహిళా క్రికెటర్ ‘మిథాలి రాజ్’ జీవిత కథ ఆధారంగా శ‌భాష్ మిథు అనే చిత్రం రూపుదిద్దుకుంటోంది. రాహుల్ దోలాకియా దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలోమిథాలి రాజ్ పాత్ర పోషిస్తోంది తాప్సీ. అందుకోసం క్రికెటర్‌గా మారిపోయింది. రెండేళ్ల క్రిత‌మే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయ‌గా, ప‌లు కార‌ణాల వ‌ల‌న సెట్స్ పైకి వెళ్లలేక‌పోయింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప‌నులు మొద‌ల‌య్యాయి. తాప్సీ బ్యాట్ ప‌ట్టి క్రికెట‌ర్‌గా మారింది. ఇక బంతుల‌ను బౌండ‌రీల‌కు త‌ర‌లించ‌డ‌మే కాదు, ఈ చిత్రంతో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌న‌క వ‌ర్షం కూడా కురిపించాల‌ని ఆశిస్తుంది. మిథాలీ పాత్ర‌కు తాప్సీ త‌ప్ప‌క న్యాయం చేస్తుంద‌ని ఆమె అభిమానులు అంటున్నారు.