ఆ కథ నాకోసమే రాసినట్లుగా ఉంది: తాప్సీ

‘హసీన్‌ దిల్‌రుబా’తో 2021లో విజయాన్ని అందుకున్నారు నటి తాప్సీ. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా తెరకెక్కిన ‘ఫిర్‌ ఆయీ హసీన్‌ దిల్‌రుబా’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈనేపథ్యంలోనే తాప్సీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ‘హసీన్‌ దిల్‌రుబా’లో హీరోయిన్‌ పాత్ర కోసం మొదట వేరే నటిని అనుకున్నారని చెప్పారు. అనుకోని కారణాల వల్ల ఆమె సినిమాలో నటించకపోవడంతో.. తాను ఆ ప్రాజెక్ట్‌లో భాగమయ్యానని చెప్పారు. తానొక విభిన్నమైన కథతో సినిమా చేయాలనుకుంటున్నానని దర్శకురాలు కనికా ధిల్లాన్‌ ఓసారి నాకు చెప్పారు.

ఆ కథ వినేందుకు నేనెంతో ఆసక్తిగా ఉన్నానని ఆమెకు తెలియజేశా. అదే సమయంలో నేను వేరే సినిమా షూటింగ్‌లో బిజీ అయ్యా. ఆ షూట్‌ పూర్తయ్యేసరికి.. కనికా వేరే నటిని సంప్రదించినట్లు తెలిసింది. వారిద్దరి మధ్య ఒప్పందం కుదిరిందని త్వరలో ఆ సినిమా పట్టాలెక్కనున్నట్లు వార్తలు వచ్చాయి.

కొన్ని నెలల తర్వాత కనికా ఫోన్‌ చేసి.. ఎందుకు? ఏమిటి? అని ప్రశ్నించకుండా స్క్రిప్ట్‌ నరేషన్‌ కోసం ఆఫీస్‌కు రమ్మని పిలిచింది. స్క్రిప్ట్‌ విన్న వెంటనే ఈ కథ నాకోసమే రాసినట్లు అనిపించింది. వెంటనే ఆ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పా’ అని తాప్సీ చెప్పారు.

ఇందులో తాప్సీ నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో యాక్ట్‌ చేశారు. 2021లో నెట్‌ప్లిక్స్‌ వేదికగా విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడీ చిత్రానికి కొనసాగింపుగా సిద్ధమైన ’ఫిర్‌ ఆయీ హసీన్‌ దిల్‌రుబా’ ఆగస్టు 9న విడుదలకు సిద్ధంగా ఉంది. విక్రాంత్‌ మస్సే, సన్నీ కౌశల్‌ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.