ఇంతకీ తగ్గిందెవరు.. మహేషా.. త్రివిక్రమా ?

మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్ మీద ఒక ప్రత్యేకమైన అభిప్రాయం ఉంది ప్రేక్షకుల్లో. గతంలో వీరు చేసిన ‘అతడు, ఖలేజా’ చిత్రాలే అందుకు కారణం. రెండు సినిమాలు థియేటర్లలో దెబ్బతిన్నా బుల్లితెరపై మాత్రం క్లాసిక్స్ అయ్యాయి.

మహేష్ బాబును త్రివిక్రమ్ ప్రజెంట్ చేసే విధానం రెండు సినిమాలు పోయాక ప్రేక్షకులకు రుచించింది. అందుకే వీరిద్దరూ కలిసి మరొక సినిమా చేస్తే బ్లాక్ బస్టర్ చేస్తాం అంటున్నారు. మహేష్, త్రివిక్రమ్ కూడ వర్క్ చేయాలనే అనుకున్నారు. కానీ ఎక్కడో వ్యవహారం చెండింది. ఇద్దరి మధ్యనా టర్మ్స్ దెబ్బతిన్నాయి. కారణాలు బయటకు రాలేదు కానీ గుసగుసలు మాత్రం గట్టిగా వినబడ్డాయి.

మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’, త్రివిక్రమ్ ‘అల వైకుంఠపురములో’ చిత్రాలు బాక్సాఫీస్ ముందు పోట్లాడుకున్న తీరు గుర్తుచేసుకుంటే వాతావరణం ఎంత వేడిగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. వాస్తవం మాట్లాడుకుంటే ఆ పోటీలో త్రివిక్రమ్ పైచేయి సాధించారు. దాంతో మహేష్ ఆలోచనలో పడ్డారు. గట్టి రాయబారాలే నడవడంతో హారిక హాసిని క్రియేషన్స్ వీరిద్దరినీ కలపడానికి వేదిక అయింది. హారిక హాసిని అంటే త్రివిక్రమ్ హోమ్ బ్యానర్ అంతే.

వాళ్ళ దగ్గర మహేష్ డేట్స్ ఉండటం, సినిమా చేయాలనే ప్రపోజల్ త్రివిక్రమ్ ముందుకు వెళ్లడంతో వీరి కాంబినేషన్ సెట్టయింది. ఈ ఏడాదిలోనే వీరి చిత్రం మొదలవుతుంది. 2022 వేసవికి రిలీజ్ పెట్టుకున్నారు. మొత్తానికి ఇక కుదరదేమో అనుకున్న త్రివిక్రమ్, మహేష్ కాంబినేషన్ కుదరడం అభిమానులకు మంచి కిక్ ఇస్తోంది.