సాయి ధరమ్ తేజ్ కోలుకున్నాడు, ఇదిగో సాక్ష్యం.!

అసలు సాయి ధరమ్ తేజ్ ఎలా వున్నాడు.? రోడ్డు ప్రమాదం తర్వాత అతని పరిస్థితి ఏంటి.? అప్పటికప్పుడు బయటకు వచ్చిన కొన్ని ఫొటోల్ని మినహాయిస్తే, సాయి ధరమ్ తేజ్‌కి సంబంధించి ఎలాంటి పొటోలూ ఆ తర్వాత విడుదల కాకపోవడం అభిమానులకు కొంత ఆందోళన కలిగించింది.
వెంటిలేటర్ అన్నారు.. సర్జరీ అన్నారు.. ఏవేవో చెప్పారు వైద్యులు. ఇటీవల పవన్ కళ్యాణ్, తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కోమాలో వున్నట్లు చెప్పడంతో ఆందోళన మరింత పెరిగింది. ఇంకోపక్క తేజు తాజా సినిమా ‘రిపబ్లిక్’ ప్రేక్షకుల ముందుకొచ్చేసింది.

‘తేజు కోలుకుంటున్నాడు.. త్వరలో అందరి ముందుకూ వస్తాడు. ప్రస్తుతం ఫిజియోథెరపీ చికిత్స తీసుకుంటున్నాడు..’ అంటూ తాజాగా పంజా వైష్ణవ్ తేజ్ ‘కొండపొలం’ సినిమా ప్రమోషన్ల కోసం మీడియా ముందుకొచ్చినప్పుడు చెప్పి కొంత మేర మెగా అభిమానుల్లో ఆందోళన తగ్గించే ప్రయత్నం చేశాడు.

ఇంతలోనే తేజు, తన ఆరోగ్యం గురించి స్వయంగా స్పందించాడు. ఆసుపత్రి నుంచే ఓ ఫొటో విడుదల చేశాడు. అందులో తేజు బొటన వేలు మాత్రమే కన్పిస్తోంది.. ‘థమ్స్ అప్’ అన్నట్టుగా. సో, సాయి ధరమ్ తేజ్ పూర్తిగా కోలుకున్నట్టే లెక్క. అతి త్వరలో.. కొద్ది రోజులోనే ఆయన ఆసుపత్రి నుంచి బయటకొస్తాడు.. మీడియాకి కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం వుందన్నమాట.