శివరాత్రి రోజు హైదరాబాద్‌ శివారులో రేవ్ పార్టీ.. 90 మంది అరెస్ట్ !

యాదాద్రి భువనగరి జిల్లా సంస్థాన్‌ నారాయణపురంలో రేవ్‌పార్టీని పోలీసులు భగ్నం చేశారు. రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు రేవ్‌ పార్టీ జరిగింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో.. రాచకొండ ఎస్‌వోటీ పోలీసులు మెరుపు దాడులు చేశారు. సుమారు 90 మంది ఈ రేవ్‌పార్టీలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. పోలీసులను చూసి 10 మంది పరారయ్యారు. మిగతావారంతా రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. అరెస్ట్‌ అయినవారిలో యువకులు, యువతులు ఉన్నారు.

టీఆర్‌ఎస్‌ నేతకు చెందిన ఓ ఫాం హౌస్‌లో ఈ రేవ్‌ పార్టీ జరిగింది. జక్కిడి ధన్వంతరెడ్డి వ్యవసాయ క్షేత్రంలో రైతు కుమారుడు …ఈ రేవ్‌ పార్టీని ఏర్పాటుచేశాడు. తెల్లవారుజామువరకు మద్యం మత్తులో యువతీయువకులు ఎంజాయ్‌ చేశారు. మద్యం సేవిస్తూ, నిషేధిత డ్రగ్స్‌ తీసుకుంటూ, బిర్యానీలు తింటూ కాలక్షేపం చేయడమే కాదు..యువతీయువకులు సరససల్లాపాల్లో మునిగితేలారు.ఘటనాస్థలంలో మద్యం బాటిళ్లతో పాటు, నిషేధిత డ్రగ్స్‌ను, వంట సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులకు చెందిన 60 బైక్‌లు, 14 కార్లను సీజ్‌ చేశారు. వాటిని సంస్థాన్‌ నారాయణపురం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

అదుపులోకి తీసుకున్న యువతీయువకులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. తప్పించుకున్న వారి వివరాలు ఆరా తీస్తున్నారు. దాడి చేసిన సమయంలో చాలామంది అమ్మాయిలు అసభ్యకర రీతిలో కనిపించినట్లు తెలుస్తోంది. పట్టుబడ్డ వారితో ప్రముఖుల పిల్లలు ఉన్నట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను శుక్రవారం మధ్యాహ్నం మీడియాకు వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు.