పుష్పరాజ్ ప్రేయసి ‘శ్రీవల్లి’ ఎలా వుందంటే..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతోన్న ‘పుష్ప’ సినిమాలో ముద్దుగుమ్మ రష్మిక మండన్నా హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్‌కి సంబంధించిన లుక్స్ ఇప్పటికే విడుదలయ్యాయి. ప్రోమోల్లో రష్మిక పాత్రని కూడా రివీల్ చేసేశారు. అయితే, తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసిన ‘శ్రీవల్లి’ లుక్ మాత్రం రష్మిక మండన్నలో ఇంతకు ముందెన్నడూ కనిపించని కొత్త కోణాన్ని చూడొచ్చు. పూర్తిగా డీ గ్లామర్ లుక్ ఇది. అయితేనేం, ఇందులోనూ కాస్త ‘స్పైసీ’ టచ్ కనిపిస్తుంది. రష్మిక ఇలా వుందేంటి.? అన్న ఇంప్రెషన్ చాలామందికి ఫొటో చూడగానే కలుగుతుంది.

గతంలో ‘రంగస్థలం’ సినిమాకి సంబంధించి సమంత పాత్ర విషయంలోనూ సుకుమార్ ఇలాంటి మ్యాజిక్కే చేశాడు. అంతకు మించి అనే స్థాయిలో ‘పుష్ప’ సినిమా కోసం రష్మిక పాత్రని సుకుమార్ తీర్చిదిద్దినట్లే కనిపిస్తోంది. ‘పుష్ప’ సినిమాకి సంబంధించి ప్రతి విషయంలోనూ ‘రంగస్థలం’తో పోలికలు వస్తూనే వున్నాయి. అది గోదావరి నేటివిటీ.. ఇదేమో చిత్తూరు నేటివిటీ.. ఆ ఒక్కటి మినహాయిస్తే.. రెండు సినిమాలకు సంబంధించి ఒకే తరహా ఇంటెన్సిటీ ప్రేక్షకుల్లో కల్పించేందుకోసం దర్శకుడు సుకుమార్, ‘పుష్ప’ టీమ్ ప్రయత్నిస్తున్నట్లుంది. ఇదిలా వుంటే, ‘పుష్ప’ సినిమాని రెండు భాగాలుగా విడుదల చేయనున్న విషయం విదితమే. ‘పుష్ప ది రైజ్’ అంటూ తొలి భాగాన్ని ఈ డిసెంబరులోనే విడుదల చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.