రాఫెల్ యుద్ద విమానాల కొనుగోలులో పెద్ద కుంభకోణమే జరిగిందంటూ ఫ్రెంచ్ యాంటీ కరప్షన్ ఏజెన్సీ ఒకటి తెరపైకి తెచ్చిన నివేదిక, భారతదేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. డిఫ్సిస్ అనే సంస్థ, రాఫెల్ యుద్ధ విమానాల తయారీ సంస్థ దసోకి భారతదేశంలో అనుబంధ సంస్థగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సంస్థతో సుషేన్ గుప్తా అనే పారిశ్రామిక వేత్తకు సంబంధాలున్నాయి. ఈ సుషేన్ గుప్తా, గతంలో వీఐపీ హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కోవడమే కాదు, జైలుకి వెళ్ళి వచ్చాడు కూడా. ఇక, ఫ్రెంచ్ యాంటీ కరప్షన్ ఏజెన్సీ వెల్లడించిన వివరాల ప్రకారం, భారతదేశానికి సంబంధించిన ఓ వ్యక్తికి దాదాపు 4 కోట్ల రూపాయల్ని ‘బహుమతి’ కింద ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ వివరాల్ని దసో సంస్థ తన ఆడిట్ సందర్భంగా ప్రస్తావించడమే కాదు, ఇంకో నాలుగు కోట్ల రూపాయల్ని చెల్లించాల్సి వుందని పేర్కొనడం గమనార్హం. మొత్తంగా 10 కోట్ల రూపాయల లంచం.. ఈ రాఫెల్ డీల్ వెనుక ఓ వ్యక్తికి ఇవ్వబడిందంటూ విపక్షాలు, అధికార బీజేపీ మీద మండిపడుతున్నాయి. అయితే, ఇంతవరకు ఈ వ్యవహారంపై బీజేపీ పెద్దలు పెదవి విప్పలేదు.
రాఫెల్ డీల్ మొదటి నుంచీ వివాదాస్పదమే. దాదాపు 140 ఫైటర్ జెట్స్ కొనుగోలు చేయాల్సి వుంది రాఫెల్ మొదటి డీల్లో భాగంగా. అయితే, కానీ.. అది కేవలం 36 విమానాల కొనుగోలుకే పరిమితమైంది. అసలు వివాదాస్పద అంశమేంటంటే, విమానాల సంఖ్య తగ్గిందిగానీ.. ఒప్పందం తాలూకు ఖర్చు మాత్రం తగ్గలేదు. పార్లమెంటు ఉభయ సభలు కొన్నేళ్ళపాటు దద్దరిల్లిపోయాయి ఈ కుంభకోణం నేపథ్యంలో. తనకున్న అధికార బలంతో బీజేపీ.. విపక్షాల గొంతు నొక్కేసింది ఈ విషయమై. మరిప్పుడు, ఈ కుంభకోణంపై కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఎలా పెదవి విప్పుతారు.? అన్నది వేచి చూడాల్సిందే.