పరకాల పైత్యం: ఇప్పుడెందుకు మొదలెట్టాడు చెప్మా.?

ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు సమయంలో ‘మేధావి’గా వార్తల్లోకెక్కారు పరకాల ప్రభాకర్. ఆయన్ని, మెగాస్టార్ చిరంజీవి బాగా నమ్మారు. ‘నమ్మొద్దు మొర్రో..’ అని ఎంతమంది హెచ్చరించినా, చిరంజీవి విన్లేదట. పరకాల తన బుద్ధి చూపించారు. ప్రజారాజ్యం పార్టీ మీద విషం చిమ్మేసి వెళ్ళిపోయారు. చివరికి ఆయన ఎక్కడ తేలారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.? ఎవరైతే ఆయన్ని ప్రజారాజ్యం పార్టీ మీదకు వదిలారో, ఆ టీడీపీ అధినేత చంద్రబాబే, రాజకీయ నిరుద్యోగి అయిపోయిన పరకాల ప్రభాకర్‌కి తన హయాంలో ‘సలహాదారు’ పదవి ఇచ్చుకున్నారు. ఆ స్వామి భక్తి మళ్ళీ చాటుకోవడంలో ప్రస్తుతం పరకాల ప్రభాకర్ బిజీగా వున్నట్టున్నారు. ప్రజారాజ్యం పార్టీ నాటి వ్యవహారాల్ని మళ్ళీ కెలుకుతున్నారు సోషల్ మీడియా వేదికగా పరకాల. జనసేన పార్టీని దెబ్బ కొట్టడమే లక్ష్యంగా ఈసారి పరకాల వ్యూహాలు వున్నట్టున్నాయి.

ఈసారి పరకాలకు, తన యజమాని నుంచి ఎలాంటి బిస్కట్లు పడుతున్నాయో.? అంటూ సోషల్ మీడియాలో ఒకటే చర్చ నడుస్తోంది. ఈ వ్యవహారం ఎలా లీకైందబ్బా.. అని పరకాల ఆందోళన చెందినట్టున్నారు.. లేకపోతే, జనసేన మీదా.. పవన్ కళ్యాణ్ మీద ఇంతలా సోషల్ మీడియా వేదికగా విషం కక్కుడేల.? లేదూ, పరకాల ప్రభాకర్ తన మానాన తాను వుంటే, ఆయన్ని కెలికిందే పవన్ అభిమానులు.. అన్న వాదనా లేకపోలేదు. సరే, ఎవరి గోల వారిది. కానీ, పరకాల ప్రభాకర్.. తాను మేధావినని చెప్పుకుంటారు కదా.. ప్రత్యేక హోదా మీదనో, ఇంకో విషయమ్మీదనో మాట్లాడకుండా, ముగిసిపోయిన చరిత్ర ప్రజారాజ్యం పార్టీ గురించి మాట్లాడటమేంటి.? ఇక్కడే ఆయన డొల్లతనం బయటపడిపోయింది. పరకాల కంటే గట్టిగా సోషల్ మీడియాలో వాతలు పెట్టగలవాళ్ళు పవన్ కళ్యాణ్ అభిమానుల్లో లక్షలాది మంది వున్నారు. ఆ విషయం ఆయనకీ బాగా తెలుసు. తెలిసీ కెలుక్కోవడమంటే బహుశా మహేష్ కత్తి లాంటోళ్ళలా సింపతీ కొట్టేయడానికేమో.