నాడు మోదీకి పాక్ ‘నో’ ..నేడు ఇమ్రాన్‌ ఖాన్ కి భారత్ గ్రీన్ సిగ్నల్ !

పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌కు భారత ఎయిర్‌లైన్స్‌ కీలక అనుమతులను మంజూరు చేసింది. ఇండియా మీదుగా శ్రీలంక వెళ్లేందుకు పాక్‌ ప్రధాని విమానానికి భారత పౌర విమానయాన సంస్థ అనుమతినిచ్చింది. భారత విమానాలకు పాక్‌ పలుమార్లు ఆంక్షలు విధించినప్పటికీ పాక్‌కు అడ్డు చెప్పకుండా కేంద్రం సానుకూలంగా స్పందించడం విశేషం.

Imran Khan Sri Lanka Visit: India Allows Aircraft To Use Airspace - Sakshi

గతంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ వీవీఐపీ విమానాలు పాక్‌ గగనతలం గుండా ప్రయాణించేందుకు అనుమతి కోరగా.. తిరస్కరించింది. జమ్మూ కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలు తీవ్రంగా జరుగుతున్నాయని, అందుకే తమ గగనతలాన్ని ఉపయోగించుకునేందుకు మోదీ విమానానికి అనుమతి ఇవ్వలేదని అధికారులు పేర్కొన్నారు.

కోవిడ్‌ సంక్షోభం తర్వాత శ్రీలంకలో అధికారికంగా పర్యటిస్తున్న తొలి దేశాధినేత ఇమ్రాన్‌ ఖాన్‌. ఈ అధికారిక పర్యటనలో లంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సే, ప్రధాని మహీంద రాజపక్సే తో ఇమ్రాన్‌ చర్చలు జరపనున్నారు. అయితే శ్రీలంక తమ పార్లమెంట్‌లో ఇమ్రాన్‌ఖాన్‌ ప్రసంగాన్ని రద్దు చేసినట్లు ఇప్పటికే ప్రకటించింది. భారత్‌తో ఎలాంటి వివాదం తలెత్తవద్దన్న ఉద్ధేశ్యంతోనే శ్రీలంక ఈ నిర్ణ‌యం తీసుకున్నట్లు కొలంబో గెజిట్ ప‌త్రిక త‌న క‌థ‌నంలో ప్రచురించింది.

అలాగే పార్లమెంటులో ప్రసంగం మినహా అన్ని కార్యక్రమాలు యథావిధిగా కొనసాగనున్నట్లు శ్రీలంక అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, 2019 అక్టోబర్‌లో భారత ప్రధాని మోదీ సౌది అరేబియాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ సందర్బంగా తమ దేశం మీదుగా వెళ్లేందుకు పాక్‌ మోదీ విమానానికి అనుమతి నిరాకరించి కుటిలబుద్దిని చాటుకుంది. కానీ తాజాగా భారత్‌మాత్రం తన ఉదార స్వభావాన్నే చాటుకుంది.