‘బింబిసార’ నుంచి లిరికల్ వీడియో ‘నీతో ఉంటే చాలు..’ రిలీజ్

‘గుండె దాటి గొంతు దాటి పలికిందేదో వైనం
మోడు బారిన మనసులోనే పలికిందేదో ప్రాణం
ఆ కన్నుల్లోనే గంగై పొంగిన ఆనందం
కాలంతో ప‌రిహాసం చేసిన స్నేహం
పొద్దులు దాటి హ‌ద్దులు దాటి జ‌గ‌ములు దాటి యుగ‌ములు దాటి
చేయందించ‌మంది ఒక పాశం.. రుణ పాశం.. విధి విలాసం”

అని ప్రేమ, పాశం, అనుబంధం గురించిన తీపి అనుభూతులను అనుభవిస్తున్నాడు మన బింబిసారుడు. అసలు త్రిగర్తల సామ్రాజ్యాధిపతి అయిన బింబిసారుడు ఈ కాలాని ఎందుకు వచ్చాడు. ఎవరితో స్నేహం కోరి వచ్చాడు. ఆయన ఏ పని కోసం వచ్చాడో ఆ పని నేర వేరిందా? ఆ వ్య‌క్తిని క‌లుసుకున్నాడా? అనే విష‌యాలు తెలియాలంటే మాత్రం ‘బింబిసారుడు’ సినిమా చూడాల్సిందే..

వైవిధ్యమైన పాత్రలు, సినిమాలతో తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో త‌న‌దైన స్థానాన్ని సంపాదించుకున్న వెర్స‌టైల్ హీరో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘బింబిసార’. ఆగస్ట్ 5న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవల్లో విడుదలవుతుంది. ఈ సందర్భంగా సోమవారం ఈ సినిమా నుంచి’నీతో ఉంటే చాలు..’ అనే పాటను ఎమోషనల్ లిరికల్ వీడియో సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.

ప్ర‌ముఖ సీనియ‌ర్ సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణి సంగీతం అందించిన ఈ సినిమాలోని ఈ పాట‌ను స్వ‌యంగా కీర‌వాణి రాయ‌టం విశేషం. మోహ‌న భోగ‌రాజు, శాండిల్య పాట‌ను ఆల‌పించారు. వశిష్ట్ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై హ‌రికృష్ణ .కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.