‘జనగణమన’లో ఆ పదాన్ని తొలగించండి ..మోడీకి సుబ్రహ్మణ్యస్వామి లేఖ !

‘జనగణమన’లో ఆ పదాన్ని తొలగించండి ..మోడీకి సుబ్రహ్మణ్యస్వామి లేఖ !

భారతదేశ జాతీయగీతం అయిన జనగణమన లో నుండి కొన్ని పదాలని తొగించాలని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి తాజాగా ఓ సరికొత్త ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకువచ్చారు. ఈ మేరకు జనగణమన లో నుండి కొన్ని పదాలని తొలగించాలని భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ కి లేఖ రాశారు.

జాతీయగీతంలోని అనవసరమైన పదాలను తొలగించి, అవసరమైన పదాలతో జాతీయ గీతాన్ని పునరుద్ధరిస్తామని 1949 నవంబరు 26న అప్పటి రాష్ట్రపతి డాక్టర్‌ రాజేంద్ర ప్రసాద్‌ చెప్పారని ఈ సందర్భంగా ఆ విషయాన్ని గుర్తు చేశారు బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి.

జనగణమన గీతాన్ని ఎవరిని ప్రశంసిస్తూ రాశారోనన్న అనుమానాలు ఉన్నాయన్నారు. 21 అక్టోబరు 1943న ఇండియన్ నేషనల్ ఆర్మీ ఇంఫాల్‌ ను స్వాధీనం చేసుకున్న వెంటనే ఆలపించిన గీతాన్నే అమలు చేయాలని ప్రధానికి రాసిన లేఖలో స్వామి డిమాండ్ చేశారు.

ఆ గీతంలో పేర్కొన్న సింధ్ ప్రాంతం ఇప్పుడు పాకిస్థాన్ భూభాగంలో ఉందని, ఇప్పుడా పదాన్ని తొలగించి ఈశాన్యం అనే పదాన్ని జోడించాలని 2019లో కాంగ్రెస్ ఎంపీ రిపున్ బోరా రాజ్యసభలో ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. ఏదేమైనా జాతీయ గీతం లోని అనవసర పదాన్ని తొలగించమని ఏకంగా మోడీకే లేఖ రాయడం తో ఈ అంశం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.