చిరు , పవన్ .. ఇప్పుడు షర్మిలా : మంత్రి శ్రీనివాస్ !

Sharmila's outburst in Telangana politics is not normal

వైఎస్‌ షర్మిల తెలంగాణలో పెట్టబోయే పార్టీపై రాజకీయ కీలక నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. తాజాగా మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఈ వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ షర్మిల ఇక్క పార్టీ పెట్టినంత మాత్రన తమకు జరిగే నష్టమేమీ లేదని కొట్టిపారేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా షర్మిల పార్టీపై స్పందించాలని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన ఇలా సమాధానం ఇచ్చారు. తెలంగాణలో ఇంతకుముందు మెగాస్టార్‌ చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌ పెట్టిన పార్టీలు ఏమయ్యాయో అందరికి తెలుసని గుర్తు చేశారు.

ఇప్పుడు కొత్తగా షర్మిల తెలంగాణలో పార్టీ పెడితే ఒరిగేదేమీ లేదని అన్నారు. తెలంగాణ కోసం ఎంతో పోరాటం చేసిన కేసీఆర్‌ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశారని, అలాంటిది పరాయి వాళ్లకు తెలంగాణ ప్రజలు మద్దతు ఇవ్వబోరని అన్నారు. ఎవరు ఏ పార్టీ పెట్టినా.. తమకేమీ నష్టం లేదని అన్నారు. 70 ఏళ్ల పాలనలో సంతోషంగా లేని ప్రజలు కేసీఆర్‌ సీఎం అయిన తర్వాత ఎంతో సంతోషంగా ఉన్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ పాలనను కొనసాగిస్తున్నారని అన్నారు.

షర్మిల ఎవరి బాణం కాదని, ఏపీలో ఏం చేయలేక ఇక్కడికి వచ్చారని శ్రీనివాస్‌ గౌడ్‌ వ్యాఖ్యానించారు. వైఎస్‌ మరణించి ఆరేళ్లు అయిపోయిందని, పరాయి నేతలు వద్దనే సొంత రాష్ట్రం తెచ్చుకున్నామని చెప్పారు. మరోవైపు, మరో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కూడా దీనిపై స్పందించారు. తెలంగాణ ప్రజలు ఆంధ్రా పార్టీలను రానివ్వరని ఎర్రబెల్లి చెప్పారు.