Mahesh Babu: మహేశ్ బాబు మాకు దేవుడు.. ఆయనను షోలో చూడగానే కన్నీళ్లు ఆగలేదు…!

Mahesh Babu: బాలయ్య హోస్ట్‌గా ప్రసారమవుతున్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే షోలో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో ప్రిన్స్ మహేశ్‌బాబు పాల్గొన్నారు. అయితే ఈ ప్రోగ్రామ్‌లో బాలయ్య ఓ సీక్రెట్‌ను షేర్ చేశారు. అదేంటంటే వెయ్యి మందికిపైగా చిన్నారులకు హార్ట్ ఆపరేషన్‌ చేయించి వాళ్ల గుండెల్లో నిలిచిపోయాడు మహేశ్ బాబు అని ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా ఓ ఫ్యామిలీ తమ ఇద్దరు చిన్నారులను స్టేజ్‌పైకి తీసుకొచ్చారు బాలయ్య. తమ చిన్నారి ఇక బతకడనే విషయాన్ని చెబుతూ తల్లి కన్నీళ్లు పెట్టుకుంది. తమ కుమారుని ప్రాణం నిలబెట్టిన మహేశ్‌ స్ఫూర్తిని వారు కొనియాడారు. ఇదే విషయంపై తాజాగా ఆ ఫ్యామిలీతో జరిపిన ఇంటర్వ్యూలో కొన్ని విషయాలను ఈ విధంగా పంచుకున్నారు.

మహేశ్‌బాబుని చూడడానికి వెళ్లాలని ఒకరోజు హాస్పిటల్‌ నుంచి కాల్ వచ్చిందని కాకినాడకు చెందిన ఆ దంపతులు శామ్యూల్, అమ్మాజీ తెలిపారు. ఆ విషయం తెలియగానే వారు చాలా సంతోషించామని, అసలు అతన్ని చూస్తామని అనుకోలేదని వారు ఆనందం వ్యక్తం చేశారు. తమ కుమారుడు 5నెలల సమయంలో ఆపరేషన్ జరిగిందని వారు చెప్పుకొచ్చారు. తాము దేవుడిని చూస్తామనుకున్నాం.. కానీ అది మనిషి రూపంలో నిజంగానే చూశామని వారు అన్నారు. నిజంగా ఆయన దేవుడిచ్చిన వరం అని వారు తెలిపారు.

తమకు తెలిసిన ఓ మహేశ్ బాబు ఫ్యాన్‌ ద్వారా సహాయం పొందగలిగామని వారు చెప్పారు. తమ కుమారునికి 3 వారాల్లోగా ఆపరేషన్ చేయాలని చెప్పినపుడు తాము డబ్బుల్లేక చాలా ఇబ్బంది పడుతున్న సమయంలోనే ఆయన పీఏ నుంచి తమకు సాయం చేస్తామని కాల్ వచ్చిందంటూ వారు చెప్పుకొచ్చారు.

ఇక తాజాగా జరిగిన షోలో మహేశ్ బాబు తమతో మాట్లాడారని, బాబుకు ఎలా ఉంది అని అడిగినట్టు కూడా వారు చెప్పారు. అసలు ఆయన్ని చూడగానే తమకు కళ్లల్లో నీళ్లు ఆగలేదని వారు తెలిపారు. ఆ సమయంలో ఆయన గనక సాయం చేయకపోతే తాము ఏమైపోయేవాళ్లమో అని వారు అన్నారు. ఆయనకు తాము ఎప్పటికీ రుణపడి ఉంటామని వారు ఆనందం వ్యక్తం చేశారు.