మెగా క్యాంపులోకి ‘కేజీఎఫ్’ దర్శకుడు.. మొదట ఎవరితో.!

మెగా కాంపౌండ్‌లో చాలామంది స్టార్ హీరోలున్నారు. ఏ దర్శకుడైనా మెగా క్యాంపులోకి ఎంట్రీ ఇచ్చాడంటే, బ్యాక్ టు బ్యాక్ ఆ క్యాంపు హీరోలతో వరుస సినిమాలు చేసేందుకు అవకాశం ఎక్కువగా వుంటుంది. మరి, ‘కేజీఎఫ్’ ఫేం ప్రశాంత్ నీల్, మెగా క్యాంపులోకి ఎంట్రీ అయితే.. అది నిజంగానే పెద్ద సినిమాల జాతర అవుతుందని నిస్సందేహంగా చెప్పొచ్చు.

విజయదశమి పండుగ పురస్కరించుకుని, మెగాస్టార్ చిరంజీవి అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లతో భేటీ అయ్యాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రముఖ నిర్మాత డివివి దానయ్య కూడా ఈ భేటీలో పాల్గొనడం గమనార్హం. ఈ భేటీలో సహజంగానే సినిమాల గురించిన చర్చే జరుగుతుటుంది.

ప్రస్తుతం ప్రభాస్‌తో ఓ సినిమా చేస్తున్న ప్రశాంత్ నీల్, యంగ్ టైగర్ ఎన్టీయార్‌తో మరో సినిమాకి కమిట్ అయ్యాడు. కాగా, ప్రభాస్ సినిమా కంటే ముందే చరణ్‌తో ప్రశాంత్ నీల్ ఓ సినిమా చేయబోతున్నాడనే ప్రచారం జరిగినా అది వర్కవుట్ కాలేదు.

అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, మెగాస్టార్ చిరంజీవితోనే ప్రశాంత్ నీల్ తొలుత సినిమా చేయబోతున్నాడట మెగా క్యాంపులో. ఆ తర్వాతే చరణ్ సినిమా వుంటుందట. ఈ రెండు సినిమాల్నీ ఇటు దానయ్య అటు, చరణ్ సంయుక్తంగా నిర్మించబోతున్నారని సమాచారం.