ఎంపీ ర‌ఘురాంకు కేఏపాల్ వార్నింగ్

వైకాపా న‌ర‌సాపురం రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌మ‌రాజు పేరు ఇప్పుడు ఇంటా బయ‌టా హాట్ టాపిక్. ప్ర‌భుత్వం తో పెట్టుకున్న వివాదంలో ర‌ఘురాం పేరు మారుమ్రోగిపోతుంది. స‌ర్కార్ వ‌ర్సెస్ ర‌ఘురాం అన్నంత‌గా వార్ న‌డుస్తోంది. ర‌ఘురాం ఒక్క‌డే ఒంట‌రిగా జ‌గ‌న్ స‌ర్కార్ తో ఫైట్ చేస్తున్నారు. ఇక్క‌డ గెలుపెవ‌రిది అన్న‌ది ప‌క్క‌న బెడితే! తాజాగా ర‌ఘురాంపై ప్ర‌జాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసారు. ఘురామ కృష్ణంరాజు హిందూ, క్రైస్తవుల మధ్య గొడవపెట్టాలని చూస్తున్నారని పాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. ఏపీలో మత మార్పిడి చట్టాన్ని తీసుకురావాలని గతంలో డిమాండ్ చేశారని, దీన్ని తాను ఖండించినట్లు పాల్ పేర్కొన్నారు.

ఈ వివాదంలో పాల్ అసిస్టెంట్ కు ఫోన్ చేసి ర‌ఘురాం చంపేస్తాన‌ని బెదిరించిన‌ట్లు పాల్ ఆరోపించారు. అయితే ఇలాంటి వాళ్ల‌ని ప్ర‌పంచంలో చాలా మందిని చూసాన‌ని..న‌న్ను చ‌పండానికి ప్ర‌య‌త్నిస్తే మీరే పోతార‌ని కే పాల్ హెచ్చ‌రించారు. గ‌త ఎన్నిక‌ల్లో ర‌ఘురాం గురించి తాను ప్రార్ధ‌న చేస్తే ఇప్పుడు ఇష్టం వ‌చ్చిన‌ట్లు వాగుతున్నార‌ని పాల్ మండిప‌డ్డారు. త‌న‌ని బెదిరించిన మెసేజ్ కూడా ఇంకా త‌న ఫోన్ లో ఉంద‌ని…అవ‌స‌రం వ‌చ్చిన‌ప్పుడు దాన్ని బ‌య‌పెడ‌తాన‌ని కేఏ పాల్ అన్నారు. దీంతో పాల్ వ్యాఖ్య‌లిప్పుడు సోష‌ల్ మీడియాలో దుమారంగా మారాయి. జ‌గ‌న్ స‌ర్కార్ టీటీడీ ఆస్తుల వేలాన్ని  ర‌ఘురాం తీవ్రంగా ఖండించిన సంగ‌తి తెలిసిందే.

అలాగే దేవస్థానంపై అన్య‌మ‌త ప్ర‌చారానికి పాల్ప‌డుతున్న‌ట్లు వ‌చ్చిన వార్త‌ల‌పై ర‌ఘురాం అప్ప‌ట్లో ఫైర్ అయ్యారు. ఈ విష‌యంలో జ‌గ‌న్ స‌ర్కార్ ర‌ఘురాంపై సీరియ‌స్ గా ఉంద‌న్న ఆరోప‌ణ‌లు తెర‌పైకి వ‌చ్చాయి. వైఎస్సార్ కుటుంబం క్రైస్త‌వమ‌తానికి చెందిన‌ది అన్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో అన్య‌మ‌త ప్ర‌చారానికి పాల్ప‌డుతున్న‌ట్లు అప్ప‌ట్లో హిందు ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మైన సంగ‌తి తెలిసిందే. అలాగే జ‌గ‌న్ ప్ర‌భుత్వం హిందు దేశంలో పాస్ట‌ర్ల సంక్షేమానికి పెద్ద పీఠ వేసిన సంగ‌తి తెలిసిందే. కె. ఏ పాల్ తాజా ఎంట్రీతో వెనుక వైకాపా నేత‌లు ఉన్నారా? అన్న అనుమానం కూడా వ్య‌క్తం అవుతోంది.