‘రణస్థలి’ మూవీ ఎలావుందంటే..?

సూరెడ్డి విష్ణు సమర్పణలో ఏ.జె ప్రొడక్షన్ పతాకంపై అనుపమ సూరెడ్డి నిర్మించిన చిత్రం ‘రణస్థలి’. ఈ చిత్రం విడుదలకు ముందే మంచి క్రేజ్ ని తెచ్చుకుంది. టీజర్, ట్రైలర్ లతో ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. పరశురామ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ధర్మ హీరోగా, అమ్ము అభిరామి, చాందిని రావులు హీరోయిన్లుగా, ప్రశాంత్, శివ జామి, అశోక్ సంగా, నాగేంద్ర , విజయ్ రాగం.. కీలక పాత్రలు పోషించారు. ఎన్నో అంచనాలతో ‘రణస్థలి’ ఈరోజు (నవంబర్ 26, 2022)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం…

కథ: బసవ (ధర్మ), అమ్ములు(చాందినీ రావు) ఇద్దరూ బావామరదళ్ళు. చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకున్న అమ్ములు.. బసవ ఇంట్లోనే పెరుగుతుంది. ధర్మ తండ్రి మున్నియ్య (సమ్మెట గాంధీ) వీరిద్దరికీ పెళ్లి చేస్తాడు. ఆరు నెలల్లో ప్రభుత్వ ఉద్యోగంలో చేరాల్సిన బసవ.. అప్పటి వరకు ఖాళీగా ఉండకుండా.. చేసిన అప్పు తీర్చడం కోసం ఏదో ఒక పని చేయాలనుకుంటాడు. ఈ క్రమంలో అతను చక్రవర్తి (బెనర్జీ) అనే పెద్దమనిషి వద్ద పనికి చేరతాడు. అయితే ఒకరోజు చక్రవర్తి తోటలో పనిచేయడం కోసం నలుగురు పనివాళ్ళు వస్తారు. వీళ్ళకు బస ఏర్పాటు చేయమని చక్రవర్తి.. బసవ, అమ్ములకి చెబుతాడు. అయితే వచ్చింది పని వాళ్ళు కాదు, మర్డర్లు చేసే కిరాయి గుండాలు. వాళ్ళ గురించి బసవకి తెలిసేలోపే.. చక్రవర్తిని, అమ్ములుని చంపేస్తారు? అసలు ఆ గుండాలు ఎందుకు చక్రవర్తిని, అమ్ముని చంపేశారు? వాళ్ళను ఎవరు పంపించారు? అసలు చక్రవర్తి ఎవరు? అనేది తెరపై చూడాల్సిన కథ.

ఎవరెలా చేశారంటే.. : బసవ పాత్రలో ధర్మ ఎంతో ఈజ్ కనబరిచాడు. అనుభవం ఉన్న నటుడిలా పాత్రలో జీవించాడు. యాక్షన్ సన్నివేశాల్లో అయితే.. స్టార్ హీరోలా చెలరేగిపోయాడు. అమ్ములు పాత్ర చేసిన చాందినీ రావు చాలా చక్కగా చేసింది. అమ్ము అభిరామి పాత్ర గురించి చెబితే స్పాయిలర్ అవుతుంది. కానీ ఆమె కూడా చాలా హుందాగా నటించి పాత్రలో పరకాయప్రవేశం చేసింది. సమ్మెట గాంధీ హీరో తండ్రి పాత్రలో జీవించేశాడు. విలన్ గా చేసిన శివ కూడా ప్రతిభను కనబరిచి నటనలో మంచి మార్కులు కొట్టేశాడు. బెనర్జీ, చంద్ర శేఖర్, మధు మణి, శ్రీనివాస్ వెట్టి, ప్రశాంత్ పండు వంటి వారు తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. వారి పాత్రలకున్న పరిధిమేరకు నటించి ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నారు.

విశ్లేషణ: ప్రతీ సన్నివేశాన్ని చిత్ర దర్శకుడు పరశురాం శ్రీనివాస్ తెరకెక్కించిన విధానం బావుంది. రొటీన్ గా వచ్చే కథలకు భిన్నంగా ఈ సినిమా ఆద్యంతం ఆసక్తిగా సాగింది. దర్శకుడు పరశురామ్ శ్రీనివాస్ తాను అనుకున్న పాయింట్ ను ఎంగేజింగ్ గా యాక్షన్ ఎపిసోడ్స్ తో చెప్పడంలో నూటికి నూరు శాతం సక్సెస్ సాధించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ ను తీర్చిదిద్దిన విధానానికి అందరూ ఫిదా అయిపోవడం ఖాయం. హీరో ఫ్రెండ్ కిడ్నాప్ ఎపిసోడ్ చూస్తే అతడి దర్శకత్వ ప్రతిభ ఏంటనేది ఇట్టే అర్ధమవుతుంది, మాస్ ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేసే విధంగా ఆ ఎపిసోడ్ ను డిజైన్ చేసుకున్నాడు. థియేటర్లలో ఈ సీన్ కు విజిల్స్ పడటం ఖాయం అనే చెప్పాలి . అలాగే లాస్ట్ లో వచ్చే ట్విస్ట్ లు కూడా ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఈ సినిమాకి క్లైమాక్స్ ప్రాణం అని చెప్పుకోవచ్చు. స్క్రీన్ ప్లే కూడా ఎక్కడా బోర్ కొట్టదు. దర్శకుడు తర్వాత ఫైట్ మాస్టర్ డ్రాగన్ ప్రకాష్ గురించి చెప్పుకోవాలి. యాక్షన్ ఎపిసోడ్స్ ను ఇతను తీర్చిదిద్దిన విధానం మెప్పిస్తుంది. కెమెరామెన్ జాస్టి బాలాజీ కూడా బాగా సహకరించి మంచి ఔట్పుట్ ఇచ్చాడు. కేశవ్ కిరణ్ సంగీతంలో పరశురాం శ్రీనివాస్ రాసిన పాటలు , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మెప్పించింది. నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. రన్ టైం కూడా 2 గంటల 20 నిమిషాలే ఉండడం మరో ప్లస్ పాయింట్ గా చెప్పుకోవాలి. దర్శకుడు పరశురాం శ్రీనివాస్ సినిమాను ప్రేక్షకులు మెచ్చేలా తీర్చిదిద్దడంలో మంచి మార్కుల్ని కొట్టేశాడు. ప్రతీ సన్నివేశం అలరించేలా సాగి ప్రేక్షకుల్లో తీవ్రమైన ఉత్కంఠను కలిగించింది. మాస్ ఆడియన్స్ ను యాక్షన్ ప్రియులను తప్పకుండా అలరించే విధంగా ఉంది. ఫ్యామిలీ ఎలిమెంట్స్ కూడా తోడవడంతో సినిమాపై ప్రతి ప్రేక్షకుడికి ఆసక్తి కలుగుతుంది. మొత్తం మీద దర్శకుడు తను అనుకున్న సినిమా కథని ప్రేక్షకులు చూసి ఎంజాయ్ చేసేలా ఉంది.

నటీనటులు: ధర్మ, అమ్ము అభిరామి, చాందిని రావు, సమ్మెట గాంధీ, బెనర్జీ, దిల్ రమేష్, ‘త్రిబుల్ ఆర్’ చంద్రశేఖర్, మధుమణి, ప్రశాంత్, శివ జామి, అశోక్ సంగా, నాగేంద్ర, విజయ్ రాగం, తేజ తదితరులు,

చిత్రం : రణస్థలి,
విడుదల : 26 నవంబర్ 2022,
దర్శకత్వం : పరశురాం శ్రీనివాస్,
నిర్మాత : అనుపమ సూరెడ్డి,
సమర్పణ : సూరెడ్డి విష్ణు,
నిర్మాణం : ఏ.జె ప్రొడక్షన్ బ్యానర్,
సంగీతం : కేశవ్ కిరణ్,
సినిమాటోగ్రఫీ: జాస్టి బాలాజీ,
ఎడిటర్ : భువనచంద్ర.ఎమ్,

రేటింగ్ : 3/5)