నాని నటించిన సినిమా సీక్వెల్ కి సిద్దమవుతున్న డైరక్టర్ మారుతి..ఏ సినిమానో తెలుసా?

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఒక సినిమా హిట్ అయ్యిందంటే చాలు దానికి సీక్వెల్ గా మరొక సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇలా ఇండస్ట్రీలో ప్రస్తుతం సీక్వెల్ సినిమాల హవా నడుస్తోంది. ప్రేక్షకులు కూడా ఇలా సీక్వెల్ సినిమాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలా తన సినిమాలతో ప్రేక్షకులని నవ్వించిన దర్శకుడు మారుతి. మొదట ‘ఈ రోజుల్లో ‘ సినిమా ద్వారా దర్శకుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన మారుతి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించాడు. ఈయన దర్శకత్వం వహించిన సినిమాలలో ‘భలే భలే మగాడివోయ్’ సినిమా ది బెస్ట్ గా చెప్పవచ్చు.

నాని, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాలో నాని మతిమరుపు ఉన్న వ్యక్తిగా నటించి మంచి కామెడీ ఎమోషన్‌తో ప్రేక్షకుల హృదయాల్ని హత్తుకున్నారు. ఈ సినిమాకి బాగా కనెక్ట్ అయిన అభిమానులు ఈ సినిమాకి సీక్వెల్‌ వస్తే బాగుంటుంది’ అని ఎదురుచూశారు. ఇప్పటికీ ఈ సినిమా సీక్వెల్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఈ సినిమా సీక్వెల్ గురించి మారుతికి ఈ ప్రశ్న ఎదురవగా ఓ సందర్భంలో ”భలే భలే మగాడివోయ్‌’కి సీక్వెల్‌ చేయాలనే ఆలోచన అప్పట్లో వచ్చింది. కానీ, కొనసాగింపు కథ కాకుండా ఏదైనా కొత్తగా చేయడమే మేలనే భావనే నన్ను మళ్లీ ఆ కథ గురించి ఆలోచించనీయలేదు” అని చెప్పుకొచ్చాడు.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మారుతి భలే భలే మగాడివోయ్ సినిమాకి సీక్వెల్ ని తప్పకుండా తీస్తానని చెప్పుకొచ్చాడు. అయితే ఈసారి యాక్షన్‌ నేపథ్యంలో ఈ సినిమాను తీయాలనుంది అంటూ మారుతి తెలియచేశాడు. ఈ సీక్వెల్ కి సంబంధించిన కథా చర్చలు ప్రారంభించలేదని ఆయన పేర్కొన్నారు. దీంతో నాని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా సోషల్ మీడియాలో ఈ సంబంధిత వీడియోని షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల మారుతి దర్శకత్వం వహించిన పక్కా కమర్షియల్ సినిమా విడుదలై మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో గోపీచంద్, రాశి ఖన్నా హీరో హీరోయిన్లుగా నటించారు.