చక్కా జామ్ : 3 గంటల పాటు రహదారుల దిగ్బంధం .. దేశంలో హైఅలెర్ట్ !

వివాదాస్పదమైన మూడు వ్యవసాయ వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని కోరుతూ సంయుక్త కిసాన్ మోర్చా చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఈ రోజు కార్యాచరణ కీలకంగా మారనుంది. దేశవ్యాప్తంగా రహదారుల దిగ్బంధనానికి ‘చక్కా జామ్‌’ పేరుతో సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపు మేరకు మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు ఆందోళన చేపట్టనున్నారు.

 Chakka Jam :50000Personnel, Water Cannons at Delhi - Sakshi

రిపబ్లిక్ డే ట్రాక్టర్ ర్యాలీ తర్వాత తలపెట్టిన అతిపెద్ద నిరసన కార్యక్రమంగా చక్కా జామ్‌ నిలవనుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దుల్లో భదత్రను కట్టుదిట్టం చేశారు. ఘాజీపూర్‌, టిక్రీ, సింగు వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఢిల్లీ, యూపీ, ఉత్తరాఖండ్ మినహా మిగితా దేశమంతా చక్కా జామ్ ఉంటుందని భారతీయ కిసాన్ యూనిన్ నేత రాకేశ్ తికాయిత్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

చక్కాజామ్‌ ముగియడానికి ముందు ఒక నిమిషం పాటు వాహనాలతో హారన్‌ కొట్టి రైతులకు సంఘీభావం తెలుపుతామని , దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై నిరసనలు శాంతియుతంగా కొనసాగనున్నాయని తెలిపారు. ఎటువంటి వాగ్వాదాలకు పాల్పడవద్దని ఆందోళనకారులకు సూచించింది. అలాగే అంబులెన్సులు, స్కూల్ బస్సులను ఈ నిరసననుంచి మినహాయింపునిస్తున్నట్టు సంయుక్తి కిసాన్ మోర్చా స్పష్టం చేసింది. ‘చక్కా జామ్‌’ కార్యక్రమానికి కాంగ్రెస్‌ మద్దతు ప్రకటించింది. మరోవైపు 50 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. గణతంత్ర దినోత్సవం రోజు ట్రాక్టర్ ర్యాలీలో జరిగిన ఘటనల నేపథ్యంలో ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో పారామిలిటరీ, రిజర్వ్‌ దళాలను మోహరించారు. వాటర్‌కెనాన్లను సిద్ధం చేశారు. 12 మెట్రో స్టేషన్ల వద్ద హై అలర్ట్‌ ప్రకటించారు.