ప్రియుడితో వధువు జంప్… చెల్లితో పెళ్లి చేసిన పెద్దలు… ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు !

పెళ్లి మండపం లో మరికాసేపట్లో పెళ్లి .. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు బంధువుల సందడితో మంటపం కోలాహాలంగా ఉంది. అంతలోనే..అలజడి. పెళ్లి కూతురు కనిపించడం లేదని, అంతటా వెతికారు. ఎక్కడా ఆచూకీ తెలియలేదు. దీంతో పెళ్లి కూతురు చెల్లెలను పెళ్లి కూతురును చేయించారు. అయితే ఇక్కడే అతనికి అసలు సిసలు ట్విస్ట్‌ ఎదురైంది. ఈ పెళ్లి చెల్లదని అధికారులు తేల్చి చెప్పడంతో వరుడు బిత్తెరపోయాడు. ఈ ఘటన ఒడిశాలోని కలహండీ జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం..మాల్పాడా గ్రామానికి చెందిన ఓ అమ్మాయికి, అదే గ్రామానికి చెందిన 26 ఏళ్ల వ్యక్తితో పెళ్లి నిశ్చయమైంది.మరికొద్ది సేపట్లో పెళ్లి తంతు జరగాల్సి ఉండగా..వధువు తాను ప్రేమించిన వ్యక్తితో పారిపోయింది. దీంతో తమ పరువు పోతుందని, వధువు చెల్లితో అయినా సరే పెళ్లి జరిపించాలని వరుడు తరుపు వాళ్లు పట్టుబట్టారు. దీంతో వేరే దారి లేక అమ్మాయి తల్లిదండ్రులు ఇందుకు అంగీకరించారు. అయితే తంతు ముగిసి అమ్మాయిని అత్తారింటికి తీసుకెళ్లాకా అధికారులు అక్కడికి చేరుకున్నారు.

అమ్మాయి వయస్సు 15 ఏళ్లే కావడంతో ఇది బాల్య వివాహం కిందకు వస్తుందని,చట్టారీత్యా ఇది నేరమని పేర్కొన్నారు. 18 ఏళ్లు వచ్చేదాకా అమ్మాయిని అత్తారింటికి పంపొద్దని చెప్పడంతో వారు కూడా అంగీకరించారని జిల్లా పిల్లల రక్షణ అధికారి సుకాంతి బెహెరా తెలిపారు. మైనర్‌ బాలికను ఆమె తల్లిదండ్రులకు అప్పగించిన అనంతరం ఇరు కుటుంబాలకు కౌన్సిలింగ్‌ ఇచ్చారు. 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే ఆ బాలిక కాపురానికి వెళుతుందని, అప్పటివరకు తన చదువును పూర్తి చేయాలనుకుంటే ఆమె ఇంట్లో లేదా హాస్టల్‌లో ఉండవచ్చని పోలీసులు నిర్ణయించారు. రెండు కుటుంబాల వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. బాల్య వివాహం చేయడం చట్ట విరుద్ధమనే సంగతి అటు వధువు, ఇటు వరుడి కుటుంబాలకు తెలియదని అధికారి తెలిపారు.