దుబ్బాక సభలో కేసీఆర్‌పై విరుచుకుపడిన ఇద్దరు కాంగ్రెస్ నేతలు

batti sensational comments on cm kcr

చేగుంటలో జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక సన్నాహక సమావేశంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాల్గొని ప్రసంగించారు.” దుబ్బాక ప్రజలు కేసీఆర్ జీతగాడిని కాకుండా… తమ కోసం పనిచేసే వ్యక్తిని రాష్ట్ర శాసనసభకు పంపాలని” పిలుపునిచ్చారు.దుబ్బాకలో కాంగ్రెస్ గెలుపు ప్రజాస్వామ్యానికి మలుపు అని భట్టి అన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలపై భట్టి నిప్పులు చెరిగారు. దుబ్బాకలో కాంగ్రెస్ గెలుపు ఎందుకు అవసరమో ఆయన వివరించారు.

batti sensational comments on cm kcr
batti sensational comments on cm kcr

ఎల్.ఆర్.ఎస్ పేరుతో కేసీఆర్ పేద, మధ్యతరగతి ప్రజల రక్తాన్ని తాగుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిడ్డ పెళ్లి కోసమో, కొడుకుల చదువుల కోసమే.. భవిష్యత్ కోసమే కష్టపడి రూపాయి రూపాయి దాచుకుని కొనుక్కున్న ఇంటి స్థలంకు పన్ను అడగడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఎల్.ఆర్.ఎస్ పేరుతో కేసీఆర్ లక్ష కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని అన్నారు. బర్రెలను కట్టేసే పాకకు, గొర్రెల కొట్టానికి, మేకల కట్టే గుంజకు కూడా రేపు కేసీఆర్ పన్నులు వేస్తారని అన్నారు. కేసీఆర్ తెచ్చిన లక్షల కోట్ల రూపాయల అప్పులు కట్టుకునేందుకు పేదల రక్తాన్ని తాగుతున్నాడని అన్నారు.

అలాగే ఉమ్మడి రాష్ట్రంలో మద్యం ఆదాయం రూ.11వేల కోట్లు ఉంటే. ఇప్పుడు ఒక్క తెలంగాణలో రూ.26 వేల కోట్లుగా ఉందని భట్టి చెప్పారు. ఇస్తామని చెప్పిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు లేవు. ఉద్యోగాలు లేవు. నిరుద్యోగ భృతి లేదు అని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ “కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగులను, విద్యార్థులను మహిళలను, రైతులను, రైతుకూలీ లను మోసం చేసిందని మండిపడ్డారు. టీవీలో మాటలు తప్పితే చేతలు లేవన్నారు. పోలీసులను వెంటపెట్టుకొని అరాచక పాలన సాగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని “ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారానికి బయలుదేరిన ఉత్తమ్ కుమార్ రెడ్డి అంతకు ముందు మాసాయిపేట సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ కార్యకర్తలు ఘనంగా సన్మానం చేశారు.

ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాత పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ తరఫున చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాసరెడ్డి బరిలో దిగుతున్నారు. బీజేపీ నుంచి రఘునందన్ రావు పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. ఇక ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని యాంకర్, బిగ్ బాస్ కంటెస్టెంట్ కత్తి కార్తీక ప్రకటించారు.

దుబ్బాక ఉపఎన్నికకు సంబంధించి ఈ నెల 9న నోటిఫికేషన్ జారీ చేస్తారు. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ అక్టోబరు 16. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబరు 19 వరకు గడువు ఉంటుంది.దుబ్బాకలో నవంబరు 3న పోలింగ్ జరగనుంది. నవంబరు 10న ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు.