నాగార్జున సినిమాల్లోకి వచ్చేముందు.. అభిమానులకు ఏఎన్నార్ రాసిన లేఖ

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో లెజెండరీ నటుల్లో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు. తెలుగు సినిమా తొలినాళ్ళ లో మొదటి సూపర్ స్టార్ నాగేశ్వర రావు గారు. ఎన్టీఆర్ సినిమాల్లోకి రాకముందే ఏఎన్నార్ లీడింగ్ హీరో. ఆ తర్వాత ఇద్దరూ కొన్ని దశాబ్దాలు ఇండస్ట్రీ ని ఏలారు. ఏఎన్నార్ కెరీర్ లో ‘దేవదాసు’, ‘మూగమనసులు’, ‘ప్రేమ్ నగర్’, ‘భక్త తుకారాం’, ‘ప్రేమాభిషేకం’ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి.

అయితే తన వారసుడిగా నాగార్జున అక్కినేని పరిచయం అవుతున్నప్పుడు సహజంగానే ఎక్కువ అంచనాలు ఉంటాయి.

సినిమాల్లోకి రాకముందు నాగార్జున పై చదువులకై అమెరికా వెళ్ళాడు. అయితే.. నాగార్జున ని హీరోగా పరిచయం చేయాలా వద్దా? అనే డైలమా ఏఎన్నార్ కు ఉండేది. అయితే.. నాగార్జున కూడా నటన వైపు మొగ్గు చూపడంతో  సినిమాల్లోకి తీసుకురావాలని అనుకున్నారు. “విక్రమ్” సినిమాతో 1986 లో నాగార్జున హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసారు. అయితే.. నాగార్జున కెరీర్ మొదట్లో కొన్ని సినిమాలలో ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వలేదు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ‘మజ్ను’ సినిమాతో నాగార్జున మొదటి హిట్ అందుకున్నాడు.

నాగార్జున ఎంట్రీ ఇచ్చే సమయంలోనే అక్కినేని తన అభిమానులందరికి ఓ బహిరంగ లేఖని రాసారు. ఈ లేఖలో గత 42 ఏళ్లుగా తనని ఆదరించి , అభిమానించిన ప్రేక్షకులను ఉద్దేశించి రాసారు. ఇన్నేళ్లు నన్ను అభిమానించారు.. విమర్శించారు.. బలపరిచారు.. అందుకు కృతజ్ఞుడినని పేర్కొన్నారు. మానవ బలహీనతలను ప్రకోపింప చేస్తూ సినిమాల్లో సక్సెస్ అయ్యే వాళ్ళు ఎంత మంది ఉన్నా.. నా సినిమాలు కుటుంబ సమేతంగా వెళ్లి చూసేవే అయి ఉండాలని అనుకున్నాను. అందుకు నా అభిమానులు సహకరించారు.

నా అభిమానులకు ఉన్న సంస్కారం వల్లే నా సినిమాలు తల్లి, చెల్లితో కలిసి వెళ్లి చూడగలిగేవిగా ఎంచుకోవడం సాధ్యమైంది. అందుకు మీకు జోహార్లు.. నా రెండో కుమారుడు సంతానం అమెరికాలో బిఎస్, ఎం ఎస్ చేసాడు.. అయితే.. సినిమాపై అభిమానంతో ఇండస్ట్రీకి రావాలనుకుంటున్నాడు. నన్ను అభిమానించినట్లే నాగార్జునని కూడా అభిమానించి.. ఆదరిస్తారని.. ప్రోత్సహిస్తారని భావిస్తున్నాను.. తన పుట్టిన రోజు అయిన ఆగష్టు 29 న అతని సినిమా రంగప్రవేశం గురించి కూడా చెప్తాము. మనసారా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నా..” అంటూ ఏఎన్నార్ లేఖ రాశారు. ఈ లేఖతో పాటు నాగార్జున ఫోటోను కూడా జత చేసారు.

కొన్నాళ్ళకి నాగార్జున కూడా తన నటన తో అందర్నీ మెప్పించి, చిరంజీవి, బాలకృష్ణ లాంటి స్టార్స్ అప్పటికే ఉన్నప్పటికీ, అలాగే వెంకటేష్ రూపం లో మరో కాంపిటీషన్ ఉన్నా ….నాగార్జున సూపర్ స్టార్ గా ఎదిగాడు.