రామ్ కోసం సరైనోడి శత్రువు దిగాడు

‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుని ఎనర్జిటిక్ స్టార్ రామ్ కాస్త ఉస్తాద్ రామ్ అయిపోయాడు. ఈ సినిమాతో యాక్షన్ హీరోగా సెటిలవ్వానుకున్న రామ్ ఆశలకు గట్టి పునాది పడింది. ఈ ఊపులోనే ఒక మాంచి మాస్ సినిమా చేయాలని లింగుస్వామికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. లింగుస్వామి కూడ రామ్ అభిరుచికి తగ్గట్టే కథ తయారుచేశారు. రామ్ సైతం కథ పట్ల చాలా ఎగ్జైట్ అవుతున్నాడు. ఇందులో ఫ్యాక్షన్ ఛాయలు కూడ ఉంటాయట. భారీ వ్యయంతో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈరోజే సినిమా షూటింగ్ చెన్నైలో మొదలైంది.

సినిమా మాంచి కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ కాబట్టి కథలో హీరోకి తగ్గట్టే విలన్ పాత్ర కూడ బలంగా రాసుకున్నారు లింగుస్వామి. పైగా సినిమా బైలింగ్వల్. తమిళంలో కూడ మార్కెట్ చేయాలి. అందుకే అటు తెలుగు, ఇటు తమిళం రెంటిలో కలిసి వచ్చేలా ఆది పినిశెట్టిని ప్రతినాయకుడిగా ఎంచుకున్నారు. ఆది పినిశెట్టి అల్లు అర్జున్ చేసిన సరైనోడు సినిమాలో విలన్ రోల్ చేసి అందరినీ మెప్పించాడు. ఆ సినిమాలో అతని పాత్ర ఎంత బలంగా ఉంటుందో ఇందులో కూడ అంతే బలంగా ఉంటుందట. ఈ చిత్రంలో రామ్ సరసన కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది.