వరుణ్ సందేశ్ ‘విరాజి’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్, ఆగస్టు 2న తగ్గించిన టికెట్ రేట్లతో థియేట్రికల్ రిలీజ్

మహా మూవీస్ మరియు ఎమ్ 3 మీడియా పతాకంపై వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో ఆద్యంత్ హర్ష దర్శకత్వంలో మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మించిన చిత్రం “విరాజి”. ఈ చిత్రం ఆగస్టు 2న విడుదల కానుంది. మరింత మంది ప్రేక్షకులను ఆకర్షించేందుకు అందుబాటు టికెట్ రేట్లతో “విరాజి” థియేటర్స్ లో ప్రదర్శితం కానుంది. సింగిల్ స్క్రీన్ లో 99 రూపాయలు, మల్టీప్లెక్సుల్లో 125 గా టికెట్ రేట్లు పెడుతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదల చేస్తున్నారు.

తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల మాట్లాడుతూ – “విరాజి” మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్ జూలై 2న చేశాం. ఆగస్టు 2న రిలీజ్ అని ఆ రోజే చెప్పాను. సరిగ్గా నెల రోజులు ప్రమోషన్స్ కు పెట్టుకున్నాం. ఒక మంచి మూవీ చేశామనే నమ్మకం మా టీమ్ అందరిలో ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం వెళ్లాం. అక్కడ కాలేజీలకు వెళ్లి పబ్లిసిటీ చేశాం. స్టూడెంట్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. వైజాగ్ బీచ్ లో ప్రమోషన్స్ చేశాం. అక్కడి మీడియాతో ఇంటరాక్ట్ అయ్యాం. అందరి దగ్గర నుంచి గుడ్ ఫీడ్ బ్యాక్ రిసీవ్ చేసుకున్నాం. మన దగ్గర కూడా ఇంటర్వ్యూస్, ప్రెస్ మీట్స్ తో సినిమాకు కావాల్సినంత ప్రమోషన్ చేస్తున్నాం. ఈ మొత్తం క్రమంలో నాకు వరుణ్ గారు ఇస్తున్న సపోర్ట్ కు థాంక్స్ చెబుతున్నా. హీరో అంటే నటించి వెళ్లడమే కాదు నిర్మాతగా నా పక్కన వరుణ్ ఉంటున్నారు. ఆయన లేకుంటే ఈ ప్రమోషన్స్ ఇంత బాగా చేసే వాళ్లం కాదు. “విరాజి”తో ఒక మంచి మూవీ రూపొందించారు దర్శకుడు ఆద్యంత్ హర్ష. ఈ మూవీకి మంచి యంగ్ ఎనర్జిటిక్ టీమ్ వర్క్ చేశారు. ఆగస్టు 2న రిలీజ్ అవుతున్న “విరాజి” సినిమాకు మీ సపోర్ట్ ఇవ్వండి. మా సినిమా కోసం టికెట్ రేట్లు తగ్గిస్తున్నాం. ప్రేక్షకులకు అందుబాటు ధరల్లో సింగిల్ స్క్రీన్ కి 99 రూపాయలు, మల్టీప్లెక్సులకు 125 రూపాయలుగా టికెట్ రేట్లు ఉంటాయి. మా మూవీ కి వీలైనంత ఎక్కువ మంది ప్రేక్షకుల్ని రప్పించేందుకు టికెట్ రేట్లు తగ్గించాం. మీరు సపోర్ట్ చేస్తే నాకు మరో నాలుగు మూవీస్ చేసే శక్తి వస్తుంది. పదిమందికి ఉపాధి దొరుకుతుంది. “విరాజి” మూవీని థియేటర్స్ లో చూస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

దర్శకుడు ఆద్యంత్ హర్ష మాట్లాడుతూ – మా “విరాజి” సినిమాకు సపోర్ట్ అందిస్తున్న మీడియా మిత్రులకు థ్యాంక్స్. ఈ సినిమా నా 37 ఏళ్ల కష్టం. “విరాజి” సినిమాకు మెయిన్ ఫిల్లర్ గా ఉన్నది మా ప్రొడ్యూసర్ మహేంద్రనాథ్ గారు. ఆయన ఒక టెక్నీషియన్ లా ఈ సినిమాకు పనిచేశారు. ప్రమోషన్స్ మొత్తం దగ్గరుండి చూసుకుంటున్నారు. నాకు ప్రతి విషయంలో ఎంతో సపోర్ట్ గా ఉన్నారు. మరో ఫిల్లర్ వరుణ్ సందేశ్ గారు. ఆయన ఈ సినిమా కోసం చూపించిన డెడికేషన్ కు హ్యాట్సాఫ్. “విరాజి” మేకోవర్ కోసం కొన్ని గంటల పాటు టైమ్ స్పెండ్ చేశారు. ఈ జర్నీలో మా అందరికీ తన సపోర్ట్ అందించారు. టెక్నీషియన్స్ లో ముగ్గురి గురించి ప్రధానంగా చెప్పాలి. డీవోపీ, మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్. ఈ మూడు విభాగాల పనితనం మీరు రేపు థియేటర్స్ లో చూస్తారు. అద్భుతంగా విజువల్స్ ఉంటాయి. మ్యూజిక్ మరో స్థాయికి సినిమాను తీసుకెళ్లింది. ఎడిటింగ్ లో ఎంతో క్వాలిటీ కనిపిస్తుంది. ఇవాళ ఈ వేదిక మీద ఉన్న కాకినాడ నాని గారు వన్ ఆఫ్ ది కీ రోల్ చేశారు. యాక్ట్రెస్ కుషాలినీ కూడా మంచి రోల్ చేసింది. ఆమెకు కూడా ఈ సినిమాతో మరింత గుర్తింపు దక్కుతుంది. “విరాజి”తో సోషల్ ఎలిమెంట్, ఎంటర్ టైన్ మెంట్ ఉన్న ఒక మంచి మూవీ చేశాం. మీరంతా ఆగస్టు 2న థియేటర్స్ లో చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

నటుడు కాకినాడ నాని మాట్లాడుతూ – నేను కూడా మీ జర్నలిస్టుల్లో ఒకడినే. వార్త, సాక్షిలో పనిచేశాను. ఇప్పుడు కాకినాడ నానిగా మూవీస్ చేస్తున్నాడు. “విరాజి” సినిమాలో మంచి క్యారెక్టర్ చేశాను. నాకు నటుడిగా గుర్తింపు తెచ్చే మూవీ ఇది. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలు ఆద్యంత్ హర్ష, మహేంద్ర కూండ్ల గారికి థ్యాంక్స్. ఈ సినిమాకు మీ ఆదరణ దక్కాలని, సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా. అన్నారు.

నటుడు మణిరూప్ మాట్లాడుతూ – “విరాజి” సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో నటించాను. ఇంతమంచి టీమ్ తో కలిసి వర్క్ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. వరుణ్ గారు ఎంతో సపోర్ట్ చేసేవారు. “విరాజి” మీ అందరికీ నచ్చుతుంది. తప్పకుండా చూడండి. అన్నారు.

నటి కుషాలినీ మాట్లాడుతూ – నేను చాలా మూవీస్ చేశాను అయితే “విరాజి”తో మీ అందరికీ బాగా గుర్తుంటానని ఆశిస్తున్నా. సినిమా చాలా బాగా వచ్చింది. వరుణ్ సందేశ్ గారు కొత్తగా కనిపించబోతున్నారు. ఆయన లుక్ చూస్తున్నారు కదా అంతే కొత్తగా మూవీ ఉంటుంది. ఈ సినిమాను మీరంతా ఆగస్టు 2న థియేటర్స్ చూడాలని కోరుకుంటున్నా. అన్నారు.

హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ – దర్శకుడు ఆద్యంత్ హర్ష “విరాజి” కథను చెబుతుంటే గూస్ బంప్స్ వచ్చాయి. డైరెక్టర్ ఆద్యంత్ హర్షకు థ్యాంక్స్ చెబుతున్నా. అంత బాగా నెరేట్ చేశాడు. నా క్యారెక్టర్ మేకోవర్ దగ్గర నుంచి ప్రతీది కొత్తగా తెరకెక్కించాడు. ఇలాంటి సబ్జెక్ట్ ను ఒక ప్యాషన్ తో ప్రొడ్యూస్ చేశారు నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల. నా కెరీర్ లో చెందూ, బాలు లాంటి క్యారెక్టర్స్ గుర్తుండిపోయాయి. అలాగే “విరాజి”లో ఆండీ క్యారెక్టర్ గుర్తుండిపోతుంది. నా మూవీస్ ఫ్లాప్స్ అవుతున్నాయి, అలాంటి టైమ్ లో నిర్మాత మహేంద్ర గారు, కథను, నన్నూ నమ్మి “విరాజి” చేశారు. నేను ఆండీ లుక్ లోనే ఏపీలో ప్రమోషనల్ టూర్ కు వెళ్లాను. ఎందుకంటే నాకు “విరాజి”తో మీరంతా మరో అవకాశం ఇస్తారనే నమ్మకంతో ప్రమోషన్ చేస్తున్నాను. నేనెందుకు ఇంత ఎగ్జైటింగ్ గా ఉన్నాను అనేది ఆగస్టు 2న థియేటర్స్ లో మూవీ చూసినప్పుడు అర్థం చేసుకుంటారు. మీరంతా థియేటర్స్ కు వచ్చి “విరాజి” చూస్తారని ఆశిస్తున్నా. అన్నారు.