‘ఊహలో తేలాల’ ఆల్బమ్ సాంగ్ ఆవిష్కరణ

అభయ్ ప్రొడక్షన్స్‌లో తెలుగు, తమిళ్ మరియు హిందీ భాషల్లో రూపొందిన ‘ఊహలో తేలాల’ ఆల్బమ్ సాంగ్ ఆవిష్కరణ శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో జరిగింది. ధనుంజయ్ ఆధ్వర్యంలో రూపొందిన ఈ ఆల్బమ్ సాంగ్‌ను సంగీత దర్శకులు కోటి, ఆర్పీ పట్నాయక్ కలిసి ఆవిష్కరించారు. ఈ సాంగ్ లాంఛ్ వేడుకకు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ CEO రవణం స్వామి నాయుడు, రచయిత లక్ష్మీ భూపాల, సీనియర్ జర్నలిస్ట్స్ ప్రభు, సుబ్బారావు వంటి వారంతా ఈ కార్యక్రమానికి హాజరై.. యూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా అభయ్ ప్రొడక్షన్స్ అధినేత ధనుంజయ్ మాట్లాడుతూ.. ‘‘పిలవగానే మా ఈ వేడుకకు వచ్చిన సంగీత దర్శకులు కోటిగారికి, ఆర్పీ పట్నాయక్‌గారికి ధన్యవాదాలు. అలాగే నన్ను ఎంతగానో ప్రోత్సహించే స్వామినాయుడుగారికి, లక్ష్మీభూపాలగారికి.. మీడియా మిత్రులు ప్రభు, సుబ్బారావుగారికి, ఈ వేడుకకు వచ్చిన ఇతర మిత్రులకు నా ధన్యవాదాలు. ‘ఊహలో తేలాల’ ఆల్బమ్‌లోని పాటలు మనసుకు హత్తుకునేలా చిత్రీకరించడం జరిగింది. మా డైరెక్టర్ ఫణి గణేష్ అద్భుతంగా ఈ పాటని చిత్రీకరించారు. ప్రముఖ నేపథ్య గాయకులు కారుణ్య, చిన్మయి, యాసిన్ నజీర్ వంటి ప్లే బ్యాక్ సింగర్స్ ఆలపించిన ఆల్బమ్ ఇది. అలాగే ఇందులో నటించిన వారు కూడా జీవం పెట్టేశారు. వారందరినీ మీ ముందుకు తీసుకువస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరొక్కసారి మా ఆహ్వానాన్ని మన్నించి.. ఈ వేడుకకు విచ్చేసి ఆశీర్వదించిన పెద్దలందరికీ ధన్యవాదాలు..’’ అని తెలిపారు.