నార్నే నితిన్ ‘ఆయ్’ ఫన్ ఫెస్టివల్‌లో జాయిన్ అయిన నాగ చైతన్య అండ్ ‘తండేల్’ టీమ్

మ్యాడ్ ఫేమ్ నార్నే నితిన్‌, న‌య‌న్ సారిక హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘ఆయ్’. స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఈ చిత్రం ఆగ‌స్ట్ 15న రిలీజైంది. తొలి ఆట నుంచే ఈ ఫన్ ఎంటర్ టైనర్ ‘ఆయ్’ ప్రేక్ష‌కాద‌ర‌ణతో పాజిటివ్ టాక్ తెచ్చుకుని థియేట‌ర్స్‌లో సంద‌డి చేస్తోంది. సినీ ప్రేక్షులు, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు సినీ సెల‌బ్రిటీలు సైతం ‘ఆయ్’ సినిమాను చూసి అద్భుత‌మంటూ చిత్ర యూనిట్‌ను అభినందిస్తున్నారు. ఇప్ప‌టికే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ చిత్ర యూనిట్‌ను ప్ర‌త్యేకంగా క‌లిసి విషెష్ అందించారు.

ఇప్పుడు ‘ఆయ్’ ఫ‌న్ ఫెస్టివ‌ల్‌లో మ‌రో క్రేజీ టీమ్ కూడా జాయిన్ అయ్యింది. అదే ‘తండేల్’ టీమ్‌. యువ సామ్రాట్ అక్కినేని నాగ చైత‌న్య, వెర్స‌టైల్ యాక్ట్రెస్ సాయి ప‌ల్ల‌వి ఈ సినిమాను ప్ర‌త్యేకంగా వీక్షించి చిత్ర యూనిట్‌ను అభినందించారు. ఈ కార్య‌క్ర‌మంలో నాగ చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి, నిర్మాత బ‌న్నీ వాస్‌, ద‌ర్శ‌కుడు అంజి కె.మ‌ణిపుత్ర‌, అంకిత్ కొయ్య‌, రాజ్ కుమాస్ క‌సిరెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

తొలి ఆట నుంచి మంచి మౌత్ టాక్ తో వరుసగా షోలు, స్క్రీన్లు పెరుగుతూ వస్తున్నాయి. ఈ సినిమా చూసి ఓ చక్కని సినిమాను చూశామనే ఫీలింగ్‌తో జనాలు బయటకు వస్తున్నారు. ప్రేక్షకుల నుంచి వస్తున్న ఈ ఆధారణపై చిత్రయూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది. మొదటి రోజు అరవై లక్షల గ్రాస్ వస్తే.. నాలుగో రోజుకి 2.2కోట్ల గ్రాస్ వచ్చింది. తొలిరోజుతో పోల్చితే మూడు వందల రెట్లు ఎక్కువగా వసూళ్లు వచ్చాయి. ఇలా రోజు రోజుకి సినిమా క‌లెక్ష‌న్స్ పెరుగుతుందంటే సినిమాకు ఉన్న ఆద‌ర‌ణేంటో అర్థం చేసుకోవ‌చ్చు.

ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో బ‌న్నీ వాస్‌, విద్యా కొప్పినీడి నిర్మాత‌లుగా గోదావరి బ్యాక్ డ్రాప్‌లో ఫ‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఆయ్ చిత్రం రూపొందింది. అంజి కె.మ‌ణిపుత్ర ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా పరిచ‌యం అయ్యారు.