కళాకారుల కన్నీటితో సంగీత దర్శకుడు ‘రాజ్’ సంతాప సభ

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో హిట్ సాంగ్స్ కి సంగీతాన్ని అందించిన ప్రముఖ సంగీత దర్శకులు రాజ్(63) ఆదివారం గుండెపోటుతో హైదరాబాద్‌లోని తన నివాసంలో కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. రాజ్‌ అసలు పేరు తోటకూర వెంకట సోమరాజు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. సంగీత ప్రపంచానికి రాజ్‌-కోటిగా మరుపురాని పాటలను అందించారు. రాజ్‌ మృతి పట్ల సంగీత ప్రియులు, పలువురు సినీ ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా సంతాపం ప్రకటించారు. రాజ్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాజ్- కోటి ద్వయం దాదాపు 150 చిత్రాలకు సంగీతాన్ని అందించారు. వాటిలో కొన్ని… ‘ముఠామేస్త్రి’, ‘బావా బావమరిది’, ‘గోవిందా గోవిందా’ ‘హలోబ్రదర్‌’…. సొంతంగా సంగీతాన్ని అందించిన వాటిలో సిసింద్రీ’, ‘రాముడొచ్చాడు’, ‘ప్రేమంటే ఇదేరా’ ఉన్నాయి. ఇక రాజ్ మృతికి సంతాపంగా తెలుగు టెలివిజన్ అండ్ డిజిటల్ మీడియా మ్యూజిషియన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో సంతాప సభ ఏర్పాటు చేసి ఆయనతో ఉన్న గత స్మృతులను పంచుకున్నారు.ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన వారందరూ తమ ముందుగా ఆయన చిత్ర పటానికి పూలు సమర్పించి ఆయనతో అనుబంధాన్ని గుర్తు చేసుకుని అనుభూతులను పంచుకున్నారు.

నటుడు శివాజీ రాజా మాట్లాడుతూ తనకు రాజుగారు దూరం చట్టం అని ఈ క్రమంలోనే ఆర్టిస్ట్ అవుదామని అనుకుంటున్నప్పుడు తాను మొదటిసారి వెళ్ళింది ఆయన ఇంటికి అని అన్నారు. రాజులు చాలామంది ఉంటారు కానీ అందులో మంచి రాజులు కొంత మందే ఉంటారు అని అలాంటి వారిలో ఈ రాజుగారు ఒకరని అన్నారు, తన తండ్రి ఇదే సినీ పరిశ్రమలో చాలా కాలం ఉన్నారు, తాను సినీ పరిశ్రమలో ఉన్నా కూడా ఆయనకు ఎలాంటి అహంకారం కానీ బేషజాలు కానీ ఉండేవి కాదని అందరితోనూ చాలా డౌన్ టు ఎర్త్ గా ఉండే వారని చెప్పుకొచ్చారు. ఇక తాజాగా ఒక టాప్ డైరెక్టర్ తనతో అన్నారని రాజ్ కోటి ఉండడం వల్లే ఒక బడా మ్యూజిక్ డైరెక్టర్ తెలుగులో ఎంటర్ కావడానికి ఐదేళ్లు పట్టిందని చెప్పుకొచ్చారు. ఇక తన ప్రొడక్షన్లో ఒక సీరియల్ చేయాలని భావించినప్పుడు రాజు గారితో సాంగ్ చేయించాలని ఆయన దగ్గరికి వెళ్లగా కథ విని ఆయన ఒక పాత్ర వేస్తానని అన్నారని అన్నారు. అలా ఆయనతో ఉన్న అనుభూతులు పంచుకున్నారు. సిసింద్రీ సినిమా సమయంలో కూడా శివ నాగేశ్వరరావు గారితో కలిసి తనను పికప్ చేసుకుని కాస్త సమయం తనతో వెచ్చించేవారని అన్నారు.

సురేష్ కొండేటి మాట్లాడుతూ తాను స్కూల్ లో మరియు కాలేజ్ చదువుకునే సమయంలో రాజ్ కోటి గారి పాటలు మొదటిసారి విన్నానని ఆ తర్వాత తన కాలేజీ చదివే రోజుల్లో కూడా వారి పాటలే వింటూ పెరిగానని అన్నారు. నేను హైదరాబాద్ కు వచ్చిన 1992వ సంవత్సరం నుంచి వారిని ఫాలో అవుతూ ఉండేవాడినని సిసింద్రీ షూటింగ్ సమయంలో వారితో సమయంలో అనుకుంటా ఆయన్ని కలిసే అవకాశం దొరికిందని అన్నారు. ఇక తర్వాత రోజుల్లో తాను విడుదల చేసిన ప్రేమించాలి సినిమాలో నా మిత్రుడు భాస్కరభట్ల రవికుమార్ గారితో లిరిక్స్ రాయించానని ఎవరితో పాటించాలి అనుకుంటున్న సమయంలో రాజ్ గారి కుమార్తె శ్వేతతో పాడించాలని భావించి ఆమెతో పాడించానని అన్నారు. ఇక దివ్య కూడా తనకు బాగా పరిచయమని మెగాస్టార్ గారి సినిమా ఖైదీ నెంబర్ 150 సినిమాకి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసేదని తాము రోజు తమ తండ్రిగారి విషయాల గురించి చర్చిస్తూ ఉండేవారిని చెప్పుకొచ్చారు. అలాంటి ఆయన ఈరోజు మనకు దూరం అవడం బాధాకరమైన సురేష్ కొండేటి అభిప్రాయపడ్డారు. ఇది మనకే కాదు సినీ పరిశ్రమ మొత్తానికి తీరని లోటు అని ఆయన అన్నారు. రాజ్ కుమార్తెలు మాట్లాడుతూ ఇంత ఘనంగా నాన్నగారి సంతాప సభను ఏర్పాటు చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని అన్నారు.

ఇక ఈ కార్యక్రమంలో *తెలుగు టెలివిజన్ అండ్ డిజిటల్ మీడియా మ్యూజిషియన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ యస్.ఏ ఖుద్దూస్ మరియు వారి అసోసియేషన్ సభ్యులు, రాజ్ గారి కుటుంబ సభ్యులు పాల్గొని భావోద్వేగానికి గురయ్యారు.