ఘనంగా రామబాణం ట్రైలర్ విడుదల వేడుక

టాలీవుడ్ లో ఉన్న క్రేజీ కాంబినేషన్లలో మాచో స్టార్ గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్‌ కాంబినేషన్ ఒకటి. వారి కలయికలో గతంలో ‘లక్ష్యం’, ‘లౌక్యం’ వంటి సూపర్ హిట్లు వచ్చాయి. ఇప్పుడు వారి కలయికలో హ్యాట్రిక్ ఫిల్మ్ గా ‘రామబాణం’ రాబోతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ లో ఈ చిత్రం రూపొందుతోంది. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఇందులో గోపీచంద్ సరసన నాయికగా డింపుల్ హయతి నటిస్తుండగా, జగపతి బాబు, కుష్బూ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మిక్కీ జె. మేయర్ స్వరకర్త. మే 5న ఈ సినిమా థియేటర్లలో భారీస్థాయిలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని, సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. ఇక తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్.

‘రామబాణం’ ట్రైలర్ విడుదల వేడుక గురువారం సాయంత్రం రాజమండ్రిలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ గారి చేతుల మీదుగా ట్రైలర్ విడుదలైంది. రామబాణం ట్రైలర్ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా ఉంది. “ఈ క్షణం, ఈ ప్రయాణం.. నేను ఊహించింది కాదు, ప్లాన్ చేసింది కాదు” అంటూ గోపీచంద్ వాయిస్ తో ట్రైలర్ ఆసక్తికరంగా మొదలైంది. రొమాన్స్, కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ సన్నివేశాలతో ట్రైలర్ ఫుల్ మీల్స్ లా ఉంది. “స్వచ్ఛమైన ఆహారం, మంచి బంధాలు.. ఈ రెండే మనిషిని కాపాడతాయి”, “ప్రపంచం మారిపోయింది. ఒకప్పుడు తల దించినోడికి మర్యాద.. ఇప్పుడు చెయ్యెత్తినోడికే మర్యాద”, “ఈట్ ఫుడ్.. నాట్ కెమికల్స్”, “ప్రతివాడు గెలుపుకోసమే బ్రతుకుతాడు.. కానీ పదిమందికి మంచి జరగాలనే ఆశయం కోసం బ్రతికేవాడు చాలా అరుదుగా ఉంటాడు” వంటి సంభాషణలు కట్టిపడేశాయి. ట్రైలర్ లో గోపీచంద్ మేకోవర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. “వాడు తమ్ముడులా లేడు.. టెర్మినేటర్ లా ఉన్నాడు” అనే ఒక్క మాటతో ఆయన పాత్ర ఎంత పవర్ ఫుల్ ఉండబోతుందో చూపించారు. చివరిలో గోపీచంద్ పంచెకట్టుతో గద పట్టుకొని కనిపించడం ట్రైలర్ కే హైలైట్ అని చెప్పాలి.

ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ.. “మన రాజమండ్రిలో ఏ సినిమా వేడుక చేసినా, అది విజయం సాధిస్తుంది. ఇదొక సెంటిమెంట్. గోపీచంద్ గారు, శ్రీవాస్ గారి కాంబినేషన్ లో లక్ష్యం, లౌక్యం అనే రెండు హిట్లు వచ్చాయి. ఈ సినిమాతో హ్యాట్రిక్ అందుకోవాలని కోరుకుంటున్నాను. రాజమండ్రిలో ఈ వేడుక జరగడం సంతోషంగా ఉంది. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఎన్నో సినిమాల షూటింగ్ లు జరుగుతుంటాయి. అలీ అన్నయ్యతో కలిసి వెళ్లి, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి రాజమండ్రిలో మంచి స్టూడియో తీసుకొచ్చే విధంగా ప్రయత్నిస్తాము. రాజమండ్రితో సినీ పరిశ్రమ అనుబంధం ఇలాగే కొనసాగుతుందని కోరుకుంటూ.. రామబాణం టీం అందరికీ ఆల్ ది బెస్ట్ తెలుపుతున్నాను” అన్నారు.

కథానాయకుడు గోపీచంద్ మాట్లాడుతూ.. “నేను నటించిన చాలా సినిమాలు రాజమండ్రిలో షూటింగ్ జరుపుకున్నాయి. రెండేళ్ల క్రితం సీటీమార్ షూటింగ్ కూడా ఇక్కడే జరిగింది. ఆ సమయంలో భరత్ గారు ఎంతో హెల్ప్ చేశారు. అలాగే ఈరోజు ఇక్కడ ఈ వేడుక జరుపుకోవడానికి అవకాశమిచ్చినందుకు కూడా ఆయనకు ప్రత్యేక కృతఙ్ఞతలు. ఆయన మంచి రాజకీయ నాయకుడిగా ఎదిగారు.. అలాగే మంచి హీరోగా కూడా ఎదగాలని కోరుకుంటున్నాను. రామబాణం గురించి చెప్పాలంటే.. వాసుతో ఇది నా మూడో సినిమా. లక్ష్యం, లౌక్యం సినిమాలు ఎలా ఉన్నాయో.. ఇది కూడా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. సినిమా చూసేటప్పుడు ఇది మన ఇంట్లో జరుగుతున్న కథలా అనిపిస్తుంది. అంతగా లీనమై ఈ సినిమా చూస్తారు. అలీ గారు, నా కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఈ సినిమాలో కూడా మా కాంబినేషన్ అలరిస్తుంది. హయతి, జగపతి బాబు గారు, కుష్బూ గారు వీళ్లందరి సపోర్ట్ తో ఒక మంచి సినిమా మీ ముందుకు వస్తుంది. కథ అందించిన భూపతిరాజా, డైలాగ్స్ రాసిన మధు, స్క్రీన్ ప్లే అందించిన అబ్బూరి రవి గారికి అందరికీ ప్రత్యేక కృతఙ్ఞతలు. మిక్కీ జె.మేయర్ చాలా మంచి పాటలు ఇచ్చాడు. ఈ సినిమా ఇంత బాగా రావడానికి ప్రధాన కారణం నిర్మాత విశ్వప్రసాద్ గారు, సహ నిర్మాత వివేక్ గారు. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ వేసవిలో మీరు మా సినిమా చూసి కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. మే 5న థియేటర్లకు వెళ్లి సినిమాని చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఈ సినిమాకి రామబాణం అనే టైటిల్ పెట్టినందుకు బాలకృష్ణ గారికి ప్రత్యేక కృతఙ్ఞతలు” అన్నారు.

చిత్ర దర్శకుడు శ్రీవాస్ మాట్లాడుతూ.. “రాజమండ్రి ప్రజలంటే నాకు చాలా ఇష్టం. నేను పుట్టింది పురుషోత్తపట్నంలో అయినా చదివింది, తిరిగింది అంతా రాజమండ్రిలోనే. ఇది కూడా నాకు సొంతూరు లాంటిదే. ఇక్కడ మా సినిమా వేడుక జరగడం సంతోషంగా ఉంది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చి, శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ భరత్ గారికి ధన్యవాదాలు. లక్ష్యం, లౌక్యం సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో.. ఈ రామబాణం కూడా అంతకంటే పెద్ద హిట్ అవుతుంది. ఈ సినిమాలో జగపతి బాబు, గోపీచంద్ గారు నటించిన ప్రతి సన్నివేశం చూస్తుంటే.. నిజంగానే అన్నదమ్ములేమో అనిపిస్తది. బయట వారి మధ్య ఉన్న అనుబంధం సినిమాలో కనిపిస్తుంది. కుటుంబ వ్యవస్థ గురించి, కుటుంబంలోని రకరకాల ఎమోషన్స్ గురించి ఈ సినిమాలో చాలా బాగా చేశాం. ఈమధ్య కాలంలో నేను నా స్నేహితులు, సన్నిహితుల నుంచి ఎక్కువగా విన్న మాట.. హిట్ సినిమాలు వస్తున్నాయి కానీ, సరదాగా అందరూ కలిసి చూసే సినిమాలు రావట్లేదు అంటున్నారు. మా సినిమా అలాంటి సినిమానే. ఈ వేసవిలో కుటుంబమంతా కలిసి చూడొచ్చు.. మిమ్మల్ని ఈ సినిమా అసలు నిరాశపరచదు. గోపీచంద్ గారు ఇప్పటిదాకా చేసిన అన్ని సినిమాల కంటే నెక్స్ట్ లెవెల్ సక్సెస్ ఈ సినిమా చూస్తది. ఈ సినిమా కోసం ఆయన ఎంతో కష్టపడ్డారు.

సినిమాలో చాలా స్టైలిష్ గా ఉంటారు. ఒకే సినిమాలో ఆయన యాక్షన్, ఎంటర్టైన్మెంట్, ఎమోషన్ అన్ని పండించారు. మిక్కీ జె. మేయర్ గారు అద్భుతమైన సంగీతం అందించారు. ఈ సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరికి కృతఙ్ఞతలు. షూటింగ్ అంతా చాలా సరదాగా సాగిపోయింది. ఈ సందర్భంగా నా కుటుంబం గురించి ఒక మాట చెప్పాలి. సొసైటీలో ఇలాంటి ఫ్యామిలీ విలువలున్న సినిమాలు చూడటమే తక్కువైపోతున్న సమయంలో.. తీసే అంత మైండ్ సెట్ ఉండాలంటే ముందు మనం మంచి కుటుంబ వ్యవస్థలో ఉండాలి. అలాంటి కుటుంబ విలువలు చిన్నప్పటి నుంచి నాకు నేర్పించిన మా నాన్న ఓలేటి గాంధీ గారికి నమస్కరిస్తున్నాను. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ గురించి చెప్పినా తక్కువే. వేగంగా వంద సినిమాలు తీయడం మా లక్ష్యమని అని ఇటీవల విశ్వప్రసాద్ గారు అన్నారు. అలాంటి మాట చెప్పడానికి ఎంతో ధైర్యం కావాలి. వ్యాపారకోణంలో చూడకుండా సినిమా మీది ప్రేమతో చేస్తున్న పీపుల్ మీడియాకి హ్యాట్సాఫ్. సినీ పరిశ్రమలో వివేక్ గారి లాంటి మంచి మనిషిని నేను చూడలేదు. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని ఇస్తుంది. సెకండాఫ్ లో కొన్ని సన్నివేశాలు చూసి ప్రేక్షకులు కంటతడి పెడతారు. పాజిటివ్ పర్సన్స్ అయినటువంటి బాలకృష్ణ గారు, ప్రభాస్ గారు కలిసి ఈ సినిమాకి రామబాణం అనే టైటిల్ పెట్టారు. అందుకే ఈ సినిమా ఇంత పాజిటివ్ గా ముందుకు వెళ్తుంది” అన్నారు.

నాయిక డింపుల్ హయతి మాట్లాడుతూ.. “రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఎన్టీఆర్ గారు, సాయి ధరమ్ తేజ్ గారు చెబుతూ ఉంటారు. దాని విలువ మా ఇంటిదాకా వచ్చాక తెలిసింది. నేను ఇక్కడికి వచ్చే ముందు మా తాతగారు ప్రమాదానికి గురయ్యారు. మీ అందరి ఆశీస్సులతో ఆయన ఇప్పుడు క్షేమంగా ఉన్నారు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే.. కోవిడ్ సమయంలో నేను కొందరు కుటుంబసభ్యులను కోల్పోయాను. కుటుంబ బంధాలు విలువైనవి అని ఆ సమయంలో అందరికీ తెలిసింది. అలాగే మా సినిమాలో కూడా అన్నదమ్ముల బంధం గురించి ఉంటుంది. కుటుంబ బంధాలతో పాటు ఇందులో కామెడీ, పాటలు అన్ని ఉంటాయి. దర్శకుడు శ్రీవాస్ గారు ప్రతి చిన్న విషయం మీద శ్రద్ధ పెట్టి సినిమా తీస్తారు. గోపీచంద్ గారు జెంటిల్ మ్యాన్. ఆయనను దగ్గర నుండి చూసి ఇంతమంచిగా ఉంటారా అని ఆశ్చర్యపోయాను. నేను రవితేజ గారితో ఖిలాడీ చేసే సమయంలో నిర్మాతలు విశ్వప్రసాద్ గారు, వివేక్ గారి చెప్పేవాళ్ళు. అప్పుడు ఆయన ధమాకా కూడా చేస్తున్నారు. ఇంత మంచి మనుషులని ఎప్పుడూ చూడలేదు అనేవాళ్ళు. ఇప్పుడు నేను పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో చేశాక నాకు తెలిసింది. షూటింగ్ చేసేటప్పుడు నన్ను ఇంటి ఆడపిల్లలా చూసుకున్నారు. ఈ ప్రొడక్షన్ లో సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. మే 5 న థియేటర్లకు వెళ్లి అందరూ ఈ సినిమాని చూడండి” అన్నారు.

ప్రముఖ నటుడు అలీ మాట్లాడుతూ.. “రామబాణం వేడుక రాజమండ్రిలో చేయడం చాలా ఆనందంగా ఉంది. గోపీచంద్ 30 సినిమాలు చేస్తే.. అందులో ఐదారు తప్పితే మిగతా సినిమాలన్నింటిలో గోపీచంద్ తో కలిసి నటించాను. ముత్యాల సుబ్బయ్య గారి దర్శకత్వంలో రూపొందిన ‘తొలి వలపు’ చిత్రంతో గోపీచంద్ హీరోగా పరిచయమయ్యాడు. అక్కడి నుంచి విలన్ గా, హీరోగా ఆయన ప్రయాణం 20 ఏళ్ళు దాటిపోయింది. గోపీచంద్, శ్రీవాస్ కాంబినేషన్ లో ఇది మూడో సినిమా. పీపుల్ మీడియా బ్యానర్ లో కార్తికేయ-2 సూపర్ హిట్, ధమాకా సూపర్ హిట్.. ఇప్పుడు రామబాణం కూడా సూపర్ హిట్. కథ మీద ఎంతో నమ్మకం ఉంటేనే గోపీచంద్ సినిమా చేయడానికి అంగీకరిస్తాడు. ఒక్కసారి అంగీకరించిన తర్వాత తన పనేదో తాను చేసుకొని వెళ్ళిపోతాడు తప్ప మిగతా విషయాల్లో తలదూర్చడు. గోపీచంద్ చాలా మంచి మనిషి. ఇటీవల తన అసిస్టెంట్ హైదరాబాద్ లో ఇల్లు కొనుకుంటున్నానని చెప్పగానే తన వంతు సాయం చేశాడు. ఇలాంటి మంచి మనిషి భగవంతుడు ఎప్పుడూ విజయాలు అందిస్తాడు. నిర్మాత విశ్వప్రసాద్ గారికి అమెరికాలో సాఫ్ట్ వేర్ కంపెనీ కూడా ఉంది. డబ్బుల కోసం కాదు.. సినిమా మీదున్న ఇష్టంతో ఆయన ఇలా వరుసగా సినిమాలు తీస్తున్నారు. మంచి నిర్మాత. ఆయనకు వివేక్ గారు సహకారం అందిస్తున్నారు. శ్రీవాస్ అద్భుతంగా సినిమా తీశాడు. రాజమండ్రి ప్రేమ, అభిమానం, ఆత్మీయత, అనురాగం ఎలా ఉంటుందో.. అలాగే ఉంటుంది ఈ సినిమా. మీరంతా థియేటర్లలో ఈ సినిమాని చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను” అన్నారు.

సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ.. “ముందుగా రాజమండ్రిలో వేడుక చేసుకునే అవకాశం ఇచ్చినందుకు ఎంపీ భరత్ గారికి ధన్యవాదాలు. సినిమా చాలా బాగా వచ్చింది. చాలా కాలం తర్వాత మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ తో, మంచి యాక్షన్ తో వస్తున్న సినిమా. ఇది