మరో సారి గొప్ప మనసు చాటుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి దేశ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులున్నారు. సినిమాల తో పాటు, ఆయన పలు సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. ఇటీవల కేరళ లోని వయనాడ్ లో వరద సృష్టించిన విధ్వంసం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికీ సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తన వంతుగా 25 లక్షల రూపాయలని కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ప్రకటించారు అల్లు అర్జున్.

తెలుగు రాష్ట్రాల తర్వాత, కేరళ లో యెనలేని అభిమానాన్ని సొంతం చేసుకున్న అల్లు అర్జున్, అక్కడ అందరికీ మల్లు అర్జున్ గా సుపరిచితం. సామాజిక మాధ్యమం X ద్వారా విరాళాన్ని ప్రకటించిన అల్లు అర్జున్ ఒక ట్వీట్ చేసారు. కేరళ రాష్ట్రం లో నెలకొన్న పరిస్థితి తనని బాధించిందని, అక్కడి ప్రజలు అతన్ని ఎంతగానో ప్రేమించారని చెప్తూనే తన వంతు సాయంగా 25 లక్షల రూపాయలని విరాళంగా ప్రకటిస్తున్నట్టు ఆయన తెలిపారు.

అల్లు అర్జున్ ఇటువంటి సహాయక కార్యక్రమాల్లో ఎప్పుడూ చురుగ్గా పాల్గొంటారు.

2013 లో ఉత్తరాఖండ్ లో వరదలు వచ్చినప్పుడు పది లక్షల రూపాయలు, 2014 లో ఆంధ్రప్రదేశ్ లో హుద్ హుద్ తుఫానొచ్చినప్పుడు 25 లక్షల రూపాయలు, 2015 లో చెన్నై లో తుఫానొచ్చినప్పుడు 25 లక్షల రూపాయలు, 2018 లో తిట్లి తుఫాను సహాయక చర్యలకు 25 లక్షల రూపాయల విరాళం తో పాటు, మూడు ఆర్ ఓ వ్వాటర్ ప్లాంట్లని, ఒక బోర్ వెల్ ని స్థాపించారు. అదే సంవత్సరం లో కేరళ లో వరద సహాయక చర్యలకు 25 లక్షల రూపాయలు విరాళం అందించారు.

అంతే కాకుండా, కరోనా సమయం లో అత్యధికంగా కోటి నలభై ఐదు లక్షల రూపాయలను, 2021 లో ఆంధ్రప్రదేశ్ లో వరద సహాయక చర్యలకు గాను 25 లక్షల రూపాయల విరాళాన్ని అందించారు. ఇలాంటి కార్యక్రమాలే కాకుండా, 2019 లో తన సొంతూరు పాలకొల్లు లో పది లక్షల రూపాయల తో కల్యాణ మండపం నిర్మించారు.

ఇలా ఎప్పటికప్పుడు సాయం అందించడం లో అల్లు అర్జున్ ముందుంటూనే అభిమానులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే, అల్లు అర్జున్ ప్రస్తుతానికి పుష్ప పార్ట్ 2 చిత్రీకరణ లో బిజీ గా ఉన్నారు.