హైదరాబాద్ లో ఉగ్ర కలకలం

హైదరాబాద్ లో ఉగ్రవాదుల కలకలం రేగింది. హైదరాబాద్ కేంద్రంగా ఓ ఇంటర్నెట్ ఎక్స్ చేంజ్ నుంచి జరుగుతున్న ఉగ్ర కార్యకలాపాల గుట్టును పోలీసులు రట్టు చేశారు. వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ద్వారా జమ్ము కాశ్మీర్, పాకిస్థాన్ లోని ఐసిస్ ఉగ్రవాదులతో రహస్యంగా సంబాషిస్తున్న దినేష్ అనే వ్యక్తిని  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ మాటలను ఎవరూ గుర్తు పట్టకుండా దినేష్ రహస్యంగా ఓ పరికరాన్ని తయారు చేసినట్టు పోలీసులు గుర్తించారు. అతడి నుంచి ఆ పరికరంతో పాటు రెండు సిమ్ బాక్స్ లు, ల్యాప్ టాప్, డెస్క్ టాప్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

జమ్ము కాశ్మీర్ లోని భారత సైన్యం కదలికలు తెలుసుకునేందుకు పాక్ ఐఎస్ ఐ ఏజంట్లు పన్నాగం పన్నినట్టు భారత నిఘా విభాగం గుర్తించింది. ఈ ఫోన్ వ్యవస్థ ద్వారా సైన్యంలో ఉన్నతాధికారులమని చెబుతూ సైనికాధికారుల రహస్య సమాచారాన్ని అడుగుతుండడంతో అనుమానం వచ్చిన ఇద్దరు అధికారులు సైన్యంలోని నిఘా విభాగానికి సమాచారం ఇచ్చారు.

దినేష్

అలర్ట్ అయిన ఆర్మీ అధికారులు ఫోన్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని ఆరా తీయగా హైదరాబాద్ లోని  ఓ ఇంటర్నెట్ ఎక్స్ చేంజ్ నుంచి వస్తున్నట్టు గుర్తించారు. దీంతో వారిచ్చిన సమాచారంతో ఎన్ ఐఏ, హైదరాబాద్ పోలీసులు రెండు రోజులు నిఘా పెట్టి నల్లకుంట టిఆర్ టి కాలనీలో నివసిస్తున్న దినేష్ ను అరెస్టు చేశారు.

దినేస్ పాకిస్థాన్ లోని ఉగ్రవాదులకు ఇన్ ఫార్మర్ గా పని చేస్తున్నట్టు గుర్తించారు. భారత సైన్యం కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకొని ఉగ్రవాదులకు దినేష్ సమాచారం ఇచ్చేవారు. దాంతో వారు జమ్ము కాశ్మీర్ లో దాడులు చేసేందుకు సిద్దపడేవారని తెలుస్తోంది. హైదరాబాదీ పాక్ ఏజెంట్ గా పని చేస్తుండడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. పోలీసులు మరింత దినేష్ నుంచి మరింత సమాచారం కోసం విచారిస్తున్నారు. 

మూడేళ్ల క్రితం దినేశ్ ఓ ఇంటర్నెట్ కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. అయితే, నష్టాలు రావడంతో దానిని మూసేశాడు. ఈజీ మనీ కోసం పాకులాడిన దినేశ్ ఏడు నెలల క్రితం తన ఇంట్లోనే ఓ వీవోఐపీ ఎక్స్‌చేంజ్ (దీని ద్వారా మన నంబరు తెలియకుండానే విదేశాలకు ఫోన్ చేయవచ్చు) ఏర్పాటు చేశాడు. దుబాయ్ సహా వివిధ దేశాలకు అతి తక్కువ ధరలో ఫోన్లు చేసుకోవచ్చంటూ ప్రచారం చేశాడు. దీంతో గిరాకీ బాగానే పెరిగింది.

నెంబర్లు గోప్యంగా ఉంచుతూనే విదేశాలకు కాల్ చేసే సౌకర్యం కల్పిస్తున్న దినేశ్‌ను ఐదు నెలల క్రితం ఐఎస్ఐ ఏజెంట్లు సంప్రదించారు. వీరి మధ్య డీల్ కుదరడంతో అప్పటి నుంచి దినేశ్ వీవోఐపీ ఎక్స్‌చేంజ్ నుంచి వారు పాకిస్థాన్ ఉగ్రవాదులతోను, కశ్మీర్‌లోని సైనికాధికారులతోనూ తరచూ మాట్లాడుతూ రహస్య సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేశాడు. సైన్యంలోని ఉన్నతాధికారుల పేరుతో ఫోన్లు చేస్తూ సైనికాధికారుల సమాచారం అడుగుతుండడంతో అనుమానం వచ్చిన వారు నిఘా విభాగానికి సమాచారం అందించడంతో విషయం బయటపడింది