వారిద్దరు అన్యోన్యంగానే ఉండేవారు. వారిద్దరు ఉన్నత చదువులు చదివారు. మంచి ఉద్యోగాలు చేస్తూ ఆనందమయిన జీవితాలను గడుపుతున్నారు. వారిద్దరి జీవితాల్లో ఏమైందో ఏమో కానీ భర్త తన భార్యను తుపాకితో కాల్చి చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
హైదరాబాద్ కు చెందిన నకిరేకంటి శ్రీనివాస్, శాంతిలు దంపతులు. వీరికి ఒక కుమారుడు కుమార్తె ఉన్నారు. శ్రీనివాస్ జెఎన్టీయూలో, శాంతి ఓయూలో చదువుకున్నారు. అనంతరం అమెరికా వెళ్లి సెటిల్ అయ్యారు. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని టెల్ ఫేయిర్ ప్రాంతంలో వీరు నివసిస్తున్నారు.
శ్రీనివాస్ ఓ కంపెనీ డైరెక్టర్ గా పని చేస్తున్నాడు. శాంతి ప్రోగ్రామర్ గా పని చేస్తుంది. వీరిద్దరికి ఏం గొడవ జరిగిందో తెలియదు కానీ చంపుకునేంతలా శ్రీనివాస్ కు కోపం వచ్చింది. సోమవారం ఉదయం శాంతిని తుపాకితో కాల్చి చంపి అనంతరం శ్రీనివాస్ కాల్చుకొని చనిపోయాడు. భార్యను ఎందుకు హత్య చేశాడు అనే దాని పై ఇంత వరకు క్లారిటి లేదు.

శ్రీనివాస్ కొడుకు ఓ యూనివర్సిటిలో చదువుతున్నాడు. కూతురు తమతో పాటే ఇంట్లో ఉంటోంది. పేలుడు శబ్దం విన్న కూతురు బయటికి వచ్చి చూసేలోగా దారుణం జరిగింది. దీంతో ఆమె పోలీసులకు సమాచారమివ్వగా వారు వచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాస్ కు సంబంధించిన అన్ని వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. తెలుగు జంట కథ విషాదంగా ముగియడంతో హైదరాబాదులోని వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది.
