అనుకున్నట్లే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రెండో నియోజకవర్గం నుంచి పోట చేసేందుకు దక్షిణ భారతదేశాన్ని ఎన్నుకున్నారు. ప్రధాని మోదీ కూడా దక్షిణ భారత్ నుంచి చేస్తారని, అందునా బెంగుళూరునుంచి పోటీచేస్తారని వార్తలొచ్చాయి. అయితే, మోదీ బెంగుళూరు నుంచి పోటీచేయడం లేదు. రాహుల్ మాత్రం కేరళ లోని వాయనాడ్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఎఐసిసి అధికారికంగా ప్రకటించింది.
మామూలుగా ఆయన ఉత్తర్ప్రదేశ్లోని అమేధీ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తారు. ఎపుడూ ఒక స్థానం నుంచే పో టీచేసిగెలుపొందేవారు. ఈ సారి ఆయన రెండో స్థానం నుంచి కూడా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.
దీనితో ఆయన దక్షిణాది నుంచి కూడా పోటీ చేయబోతున్నారని కొద్ది రోజులుగా వస్తున్న ఊహాగానాలు నిజమయ్యాయి.
ఉత్తర భారత దేశంలోని కాంగ్రెస్ అక్కడక్కడ తప్ప ఎక్కడా పూర్తిగా మిగల్లేదు. దక్షిణ భారతంలో కూడా పతనం ప్రారంభమయింది. పోయిన తూరి 2014లో ఆంధ్రప్రదేశ్ లో ఒక్కీసీటు కూడా గెలవలేదు. ప్రత్యేక రాష్ట్రం ప్రసాదించినా తెలంగాణలో కొనవూపిరితోనే కొట్టుమిట్టాడుతూ ఉంది. తమిళనాడు ఎపుడూ లేదు. కేరళలో ఉన్నది వూడే పరిస్థితి వస్తూన్నది. బిజెపి కేరళనువశపర్చుకోవాలని చాలా విధాలుగా ప్రయత్నిస్తున్నది. కర్నాటక లోనే ఆ పార్టీ కొంత ధైర్యంగా ఉంది. ఎందుకంటే, కాంగ్రెస్ సొంత ప్రభుత్వం పోయినా, సంకీర్ణ రూపంలో కొనసాగుతూ ఉంది. బిజెపి రాకుండా అడ్డుకోగలిగింది. ఈనేపథ్యంలో రాహుల్ తాను దక్షిణాదికి కూడా ప్రతినిధి అని చెప్పుకునేందుకు కేరళవస్తున్నారు
పార్టీ అధికార ప్రతినిధి రణ్దీప్ సూర్జేవాలా ఆదివారం ఈ విషయం ప్రకటించారు. పార్టీ ఈ విషయాన్ని ట్విట్టర్ లో కూడా షేర్ చేసింది.
రాహుల్ ను తమిళనాడు, కర్నాటక, తెలంగాణలో పాటు కేరళ కాంగ్రెస్ నాయకులకు తమ రాష్ట్రంనుంచ పోటీ చేయాలని అనుకున్నారు. కర్నాటక కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కు బలమయిన కేంద్రమయిన కర్నాటక- హైదరాబాద్ ప్రాంతానికి చెందిన బీదర్ నియోజకవర్గాన్ని ఆయన కోసం సిద్ధం చేశారని వార్తలొచ్చాయి.
అయితే, కేరళ కాంగ్రెస్ నేతల విజ్ఞప్తిని మన్నించారు.వాయనాడ్ నుంచి పోటీ చేయడానికి అంగీకరించారని సూర్జేవాల చెప్పారు.
‘ కేరళ కాంగ్రెస్ పార్టీకి వ్యూహాత్మకంగా చాలా కీలకయిన రాష్ట్రం. దక్షిణాది రాష్ట్రాలపై భాజపా చిన్నచూపు చూస్తోంది. అందుకోసమే ఈ రాష్ట్రాలకు భరోసా ఇచ్చేందుకు కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అభ్యర్థన మేరకు రాహుల్ వాయనాడ్ నుంచి పోటీ చేసేందుకు సుముఖం చూపారు,’ అని కాంగ్రెస్ ప్రతినిధి చెప్పారు.
ఇది ఇలా ఉంటే అమేధీలో రాహుల్ పునాదులు కదులుతున్నాయని, అక్కడ బిజెపి అభ్యర్థి కేంద్రమంత్రి స్మృతి ఇరానీ గెలవబోతున్నారని అందుకే ఆయన రెండో నియోజకవర్గం వెదుక్కుంటున్నారని బిజెపి చెబుతూ ఉంది. (ఫోటో ట్విట్టర్ నుంచి)
