ఇద్ద‌ర్ని హ‌తమార్చి, `పేట` సినిమాకెళ్లాడు!

ఇద్ద‌రిని దారుణంగా హ‌త్య చేసిన హంత‌కుడి మాన‌సిక ప‌రిస్థితి ఎలా ఉంటుంది? భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌వుతారు. త‌ప్పించుకోవ‌డానికి మార్గాలు అన్వేషిస్తారు క‌దా! కేర‌ళ‌లో హంత‌కుడు దీనికి భిన్నంగా ప్ర‌వ‌ర్తించాడు. ఇద్ద‌ర్ని నరికి చంపిన త‌రువాత చేతులు క‌డుక్కుని, సినిమాకెళ్లాడు. థియేట‌ర్‌లో, ప్రేక్ష‌కుల మ‌ధ్య కూర్చుని త‌న అభిమాన హీరో ర‌జినీకాంత్ `పేట‌` సినిమాను చూశాడు. విజిల్స్ వేస్తూ ఎంజాయ్ చేశాడు.

పోలీసుల విచార‌ణ‌లో హంత‌కుడు ఈ విష‌యాన్ని స్వ‌యంగా వెల్ల‌డించాడు. అత‌ని పేరు బొబిన్‌. కేర‌ళ‌ల‌లోని ఇడుక్కి జిల్లాలో సంచ‌ల‌నం సృష్టించిన జంట హ‌త్య‌ల కేసులో ప్ర‌ధాన నిందితుడు అత‌ను. పేట సినిమా చూసిన వెంట‌నే రైల్వేస్టేష‌న్‌కు వెళ్లాడట‌. ప్లాట్‌ఫామ్‌పై క‌నిపించిన రైలెక్కి త‌మిళ‌నాడుకు వెళ్లిపోయాడు. ఆరు రోజుల త‌రువాత పోలీసులు అత‌ణ్ని మ‌ధురైలో అరెస్టు చేశారు. ఇడుక్కికి తీసుకొచ్చారు.

ఈ సంద‌ర్భంగా కొన్ని దిగ్భ్రాంతిక‌ర విష‌యాల‌ను అత‌ను వెల్ల‌డించాడు. ఈ నెల 13వ తేదీన ఇడుక్కిలోని ల‌వంగాల‌ ఎస్టేట్ య‌జ‌మాని జాక‌బ్ వ‌ర్ఘీస్‌, ఆయ‌న అనుచ‌రుడు ముత్త‌య్య దారుణ‌హ‌త్య‌కు గుర‌య్యారు. ఈ కేసులో నాలుగురోజుల త‌రువాత ఇడుక్కి పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అనుమానంతో చెరియార్‌కు చెందిన చిత్ర‌వేలు, ఆయ‌న భార్య క‌పిలను అదుపులోకి తీసుకుని విచారించ‌గా.. అస‌లు విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.

బొబిన్‌తో క‌లిసి తామే హ‌త్య చేశామ‌ని వారు అంగీక‌రించారు. జాక‌బ్ వ‌ర్ఘీస్ ల‌వంగాల‌ను విక్ర‌యించ‌డం ద్వారా వ‌చ్చిన డ‌బ్బును అప‌హ‌రించ‌డానికే తాము ఈ ఘాతుకానికి పాల్ప‌డ్డామ‌ని అన్నారు. జాకబ్‌, ముత్త‌య్య‌ల‌ను తానే క‌త్తితో పొడిచి చంపిన‌ట్లు బొబిన్ వెల్ల‌డించాడు. అనంత‌రం తాను పేట సినిమా చూసి, మ‌ధురైకి పారిపోయాన‌ని త‌మ విచార‌ణ సంద‌ర్భంగా బొబిన్ అంగీక‌రించిన‌ట్లు పోలీసులు తెలిపారు.