KA Paul Warns CM Stalin: ప్రముఖ శాంతి ప్రబోధకుడు, ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ మరోసారి తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ను ఉద్దేశించి ఆయన ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. చెన్నైలో తాను నిర్వహించనున్న ‘గ్లోబల్ పీస్ ఫెస్టివల్’కు హాజరుకాకపోతే, వచ్చే ఎన్నికల తర్వాత స్టాలిన్ ‘మాజీ ముఖ్యమంత్రి’గా మిగిలిపోతారని కేఏ పాల్ జోస్యం చెప్పారు.
శుక్రవారం చెన్నైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్ ఈ వివరాలను వెల్లడించారు. ఈ నెల ఫిబ్రవరి 22, ఆదివారం సాయంత్రం 5 గంటలకు చెన్నైలోని వైఎంసీఏ (YMCA) గ్రౌండ్స్లో భారీ ఎత్తున ప్రపంచ శాంతి సభను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.
ఈ సభకు అనుమతి కోరిన 48 గంటల్లోనే ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పర్మిషన్ ఇచ్చినందుకు స్టాలిన్ సర్కారుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అయితే, కేవలం అనుమతి ఇస్తే సరిపోదని, ముఖ్యమంత్రి స్వయంగా హాజరవ్వాలని ఆయన పట్టుబట్టారు.

జయలలిత ఉదంతాన్ని గుర్తు చేస్తూ హెచ్చరిక. ముఖ్యమంత్రి స్టాలిన్కు గత చరిత్రను గుర్తు చేస్తూ కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
“2002లో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత నా శాంతి సభకు రమ్మంటే రాలేదు. ఫలితంగా 2004 ఎన్నికల్లో ఆమె పార్టీ 38 ఎంపీ స్థానాల్లో ఘోరంగా ఓడిపోయింది. ఆ తర్వాత ఆమె తప్పు తెలుసుకుని నన్ను ఆహ్వానించారు. 2014లో నా మద్దతు కోరగా, ఆమె మళ్లీ విజయం సాధించారు. ఇప్పుడు స్టాలిన్ కూడా అదే తప్పు చేస్తే.. మే 2026 ఎన్నికల తర్వాత ఆయన మాజీ సీఎం కావడం ఖాయం.”
ఇది రాజకీయం కాదు.. ప్రపంచ శాంతి కోసం! ఈ సభ వెనుక ఎటువంటి రాజకీయ ఉద్దేశాలు లేవని కేఏ పాల్ స్పష్టం చేశారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ మత పెద్దలు ఈ వేదికపైకి రానున్నారు. ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా 200 దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

“కనీసం రాత్రి 7 నుంచి 9 గంటల మధ్యలో కొద్దిసేపైనా వచ్చి శాంతికి సంఘీభావం తెలపండి. శాంతిని, ప్రజలను గౌరవిస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది” అని ఆయన సూచించారు.
ప్రస్తుతం కేఏ పాల్ చేసిన ఈ వ్యాఖ్యలు తమిళనాట రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మరి పాల్ హెచ్చరికపై ముఖ్యమంత్రి స్టాలిన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

